వీధికుక్కల దాడిలో మరో చిన్నారి మృతి
సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మరణించాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు. కొంతదూరం ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఈ ఘటనలో మెదడులో కొంత భాగం కూడా బయటపడింది. దీంతో తీవ్రగాయాలైన బాలుడు మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే…
సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి గ్రామానికి చెందిన భరత్-లక్ష్మీ దంపతులకు విహాన్ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. పని కోసం, బతుకుదామని నెల కిందట హైదరాబాద్కు వచ్చారు.జవహర్నగర్లోని ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటున్న లక్ష్మీ సోదరుడి ఇంట్లోనే ఉంటున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో విహాన్ ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. అప్పుడే గుంపులుగా వచ్చిన వీధికుక్కలు ఒక్కసారిగా విహాన్పై దాడి చేశాయి. కుక్కల దాడిలో విహాన్ మరణించడం స్థానికంగా కలకలం సృష్టించింది. జవహర్నగర్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సమస్యను పట్టించుకోలేదని, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.