సిరాన్యూస్, ఆదిలాబాద్
బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటే : అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి
బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఆదిలాబాద్ నుండే నాంది
* రాష్ట్రస్థాయిలో నేతల మధ్య కుదిరిన పరస్పర ఒప్పందం
బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకటేనని, కుట్రలు, కుతంత్రాలు తేట తెల్లం అయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రాజకీయ పరిణామాలతో ఈ రెండు పార్టీలు ఒక్కటి కాబోతున్నాయనే సంకేతాలు నిజమవుతున్నాయంటూ ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్లో అవిశ్వాసం నెగ్గినప్పటికీ..రాబోయే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీ నేతను గద్దె దించి మైనార్టీలకు బీజేపీ, బీఆర్ఎస్లు వ్యతిరేకమని మరోసారి రుజువు చేశాయన్నారు. ఇన్నాళ్లు నమ్మిమోసపోయిన ప్రజలంతా ఇది గుర్తెరిగారని, భవిష్యత్తులో వారికి గట్టి బుద్ధిచెబుతారంటూ హితవు పలికారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…బీఆర్ఎస్ బిజెపి దోస్తీ ఆదిలాబాద్తో శ్రీకారం చుట్టనున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ విలీనానికి ఇటీవల ఢిల్లీలో చర్చలు జరిగాయన్నారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు మొన్న లోక్ సభ ఎన్నికల్లో దొంగచాటుగా కలిశాయన్నారు. ఇపుడు పట్టపగలే బరితెగిస్తున్నాయంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మాట్లాడారన్నారు. అందుకే బీఆర్ఎస్ కు బిజెపి మద్దతునిచ్చిందని ఆరోపించారు. రాష్ట్రస్థాయిలో రెండుపార్టీల బహిరంగ పొత్తుకు, జరగబోయే విలీనానికి ఆదిలాబాద్ నుండే నాంది పలకబోతున్నారన్నారు. అందులో భాగంగానే బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాసానికి హాజరయ్యారన్నారు. ఈ రెండు పార్టీల అపవిత్ర పొత్తును ప్రజలు తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసివచ్చినా ఎదుర్కొంటామని, ప్రజాక్షేత్రంలోనే తమ దమ్మేందో చూపిస్తామంటూ సవాల్ విసిరారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీ నేత జహీర్ రంజానీని గద్దె దింపడం ద్వారా మైనారిటీలకు తాము వ్యతిరేకమని ఆ రెండు పార్టీలు రుజువు చేశాయన్నారు. అదే పదవీని దక్కించుకోవడానికి బీజేపీ మద్దతిచ్చిందని, రాష్ట్రస్థాయిలో దీనిపై ఒప్పందం కుదిరిందని అన్నారు. ఆరు నెలల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 49 వార్డులకు 40 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ జెండాను సగర్వంగా ఎగరేస్తామన్నారు. భవిష్యత్తులో ఎంఐఎంతో కలిసి నడుస్తామని తెలిపారు. రాష్ట్ర నాయకత్వం సూచనలకు అనుగుణంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.అవిశ్వాసం నేపథ్యంలో కాంగ్రెస్కు మద్దతిచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
విశ్వసనీయత, నమ్మకానికి మారుపేరు రేవంత్రెడ్డి
తమ ప్రజా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విశ్వసనీయత, నమ్మకానికి మారుపేరని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి 2 లక్షల రుణమాఫీ ప్రకటించి గురువారం లక్ష రుణమాఫీ చేశారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక్క రేవంత్రెడ్డికే సాధ్యమైందన్నారు. ఇందుకుగాను ఆదిలాబాద్ రైతుల పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీష్ రావు రోషం, పౌరుషముంటే వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నామని తెలిపారు.ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడడమే కాంగ్రెస్ నైజమని పేర్కొన్నారు. ఇది సంబరాలు జరుపుకోవాల్సిన సమయమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మైనార్టీ నేత జహీర్ రంజాని, పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, బాయిన్ వార్ గంగారెడ్డి, బండి దేవిదాస్ చారి, భోజారెడ్డి, సుధాకర్ గౌడ్, పోరెడ్డి కిషన్, తమ్మలవార్ చందు, కందుల సుకేందర్, యాల్ల పోతా రెడ్డి, కయ్యుమ్, సురేందర్ రెడ్డి, గేడం అశోక్, జగదీష్ రెడ్డి, పోతారెడ్డి, రమేష్, సాహెబ్ రావు తదితరులు పాల్గొన్నారు.