అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా కట్టుదిట్టమైన చర్యలు

– ప్రతి కుటుంబం ప్రామాణికంగా 2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపు
– రైతు రుణమాఫీపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
 సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం మన జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రైతు రుణ మాఫీపై బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని మన జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం ప్రతి రైతు కుటుంబానికి 2 రెండు లక్షల వరకు అసలు, వడ్డీ మాఫీ అవుతుందని అన్నారు. రేషన్ కార్డు  రైతు రుణమాఫీ పథకం అమలుకు తప్పనిసరి కాదని, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు ఒక ప్రామాణికంగా మాత్రమే రేషన్ కార్డును వినియోగిస్తున్నామని, భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పథకం అమలు అవుతుందని, ఈ అంశం పట్ల రైతులలో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు నూతనంగా తీసుకున్న రుణాలు, రెన్యువల్ చేసుకున్న రుణాలు అసలు, వడ్డీ కలిపి 2 లక్షల రూపాయల వరకు ప్రతి రైతు కుటుంబానికి మాఫీ జరుగుతుందని, రైతు కుటుంబానికి రెండు లక్షల కంటే అధికంగా రుణం ఉన్నట్లయితే కుటుంబంలోని మహిళ పేరు పై రుణాలు నిబంధనల మేరకు ముందుగా మాఫీ అవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం జమ చేసిన వెంటనే బ్యాంకులు లోన్ ఖాతా నుంచి సంబంధిత సొమ్మును రైతుల సేవింగ్స్ ఖాతాలోకి బదలాయింపు చేయాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ సహకార సంఘాల బ్యాంకులు, డీసీబీ పూల్ కు వచ్చే రుణ మాఫీ సొమ్ము  సంబంధిత రైతులకు చేరేలా వ్యవసాయ విస్తరణ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించా రు. రుణమాఫీ పథకంపై రైతులు ఫిర్యాదులను నమోదు చేస్తే 30 రోజులలో పరిష్కరించడం జరుగుతుంద ని, మన జిల్లాలో ఫిర్యాదుల నమోదు కోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ సైతం ఏర్పాటు చేశామని, రుణమాఫీ పథకంపై రైతులు తమ సందేహాలను 18005995459 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.
రుణమాఫీకి సంబంధించి వచ్చే ప్రతి ఫిర్యాదు జాబితా రూపొందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. రుణమాఫీకి సంబంధించి జారీ చేసిన ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా సజావుగా ప్రక్రియ జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న సాగు పనులపై కలెక్టర్ వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. క్రాప్ బుకింగ్ ప్రక్రియపై వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పూర్తిస్థాయిలో బుకింగ్ జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. నాట్లు వేసేందుకు అవసరమైన మేర ఎరువుల స్టాక్ జిల్లాలో అందుబాటులో ఉందని, మండల స్థాయిలో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయా  చెక్ చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  రైతు భీమా పథకం క్రింద సంబంధిత రైతు కుటుంబాలకు పది రోజుల కంటే ఆలస్యం కాకుండా లబ్ధి చేకూరేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రుణమాఫీ టోల్ ఫ్రీ నెంబర్  18005995459 ను జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు జే.అరుణ శ్రీ, జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, ఎల్.డి.ఎం.వెంకటేష్, బ్యాంకర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *