సిరా న్యూస్,లక్నో;
ఉత్తర్ప్రదేశ్ లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రామమందిర ప్రాణప్రతిష్ఠకు గడువు సమీపిస్తుండటంతో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెలా చివరి నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు పూర్తవుతాయని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. గుడి నిర్మాణానికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఇప్పటి వరకు రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలతో ట్రస్టుకు కుబేరుని ఆశీర్వాదం ఉందనన్నారు. తమ వద్ద ఇంకా రూ.3 వేల కోట్ల మిగులు నిధులు ఉన్నాయిని తెలిపారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలోని విగ్రహాలపై సూర్యకిరణాలు నిరంతరాయంగా ప్రసరించేలా ఆలయం శిఖరంపై ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో బెంగళూరులో ఈ నిర్మాణాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూర్కీ, పుణెలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా అందిస్తోంది. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ ట్రస్టు భావిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో వేర్వేరుచోట్ల 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో 12 వేల నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. సాధువులు సహా తాము ఆహ్వానించిన ప్రముఖులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. వేర్వేరు బృందాలకు ఈ బాధ్యతలు అప్పగించాం అని వివరించారు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 20- 24 మధ్య జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధాని మోడీ కూడా హాజరవుతారు. అయితే ప్రధాని ఏ రోజున స్వామివారి సేవలో పాల్గొంటారన్న అంశంపై ప్రధాని కార్యాలయం స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంది.