సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు: మాజీ మంత్రి జోగురామన్న
రైతన్నలతోనే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుభరోసా పెట్టుబడి సహాయం గురించి ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఆ నగదునే రుణమాఫీ కింద చెల్లించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక మోసాలను యావత్ రైతాంగం గమనిస్తుందని, రైతు భరోసా కింద అందించాల్సిన పెట్టుబడి సహాయాన్ని రుణమాఫీకి మళ్ళించి రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియలోనూ అనేక మంది రైతులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రైతు బంధు కింద బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏడాదికి జిల్లాలో లక్ష అరవై నాలుగు వేల మంది రైతులకు 550 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం అందించామని, ప్రస్తుతం రైతు రుణమాఫీ పేరిట కేవలం 18,821 మంది రైతులకు ప్రభుత్వం 120 కోట్ల 79 లక్షలను మాఫీ చేసిందన్నారు. అన్నదాతల సంక్షేమానికి దాదాపు పదేండ్ల కాలంలో దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయాలను ఖర్చు చేసిన ఘనత గత బీఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీ లోనూ అనేక మంది రైతులకు న్యాయం జరగలేదని, తీసుకున్న ఋణం మొత్తం మాఫీ కాకపోవడంతో చాల మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఉదాహరణలతో సహా వివరించారు. విద్యార్థుల పక్షాన కేటీఆర్ సీఎం కేసీఆర్ గ్రూప్ ఎగ్జామ్స్ పై చేసిన నిరసనతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. విద్యార్థుల ఐక్యమత్యం పట్ల కేటీఆర్ కెసిఆర్ అర్థం వ్యక్తం చేశారని, అలాగే రానున్న రోజుల్లో రైతులు సైతం సంఘటితమై ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రోకండ్ల రమేష్ మెట్టు ప్రహ్లాద్, ఇజ్జగిరి నారాయణ, గండ్రత్ రమేష్, మార్శెట్టి గోవర్ధన్,సేవ్వా జగదీష్, నవాతే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.