సంక్షేమ బడ్జెట్….

సిరా న్యూస్;

మొన్న జరిగిన ఎన్నికల ప్రభావమో… ఏమో కానీ ఈ సారి మోడీ బడ్జెట్ సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు పెద్ద పీట వేశారు. ఎన్డీయే 3.0 కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా ఉన్న ఏపీ, బీహార్‌లకు కేంద్ర బడ్జెట్‌లోఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. ఏపీలో రాజధాని అమరావతికి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్‌కు పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించారు. అయితే, బీహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలన్న డిమాండ్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, యువతకు ఉద్యోగ కల్పన – నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, ఇంధన భద్రత, పట్టణాభివృద్ధి, మౌలిక రంగం, పరిశోధన – ఆవిష్కరణలు, తయారీ – సేవలు, భవిష్యత్ సంస్కరణలు వంటి అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించారు. ఈ ప్రాధామ్యాలపై భవిష్యత్ బడ్జెట్స్ కూడా ఆధారపడి ఉంటాయని తెలిపారు. వీటిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, మధ్య తరగతి రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఎక్కువగా మహిళలు, రైతులు, పేదలు, యువతకు మేలు చేకూర్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.రాబోయే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని నిర్మలమ్మ తెలిపారు. అలాగే, 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేలా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. భారతీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకూ విద్యా రుణాలు ఇస్తామని అన్నారు. ఈసారి బడ్జెట్‌లో విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం అధికంగా నిధులు కేటాయించారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఇందు కోసం రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్‌లో వ్యవసాయం, మహిళ, మౌలిక సదుపాయాల కల్పన కోసం నిర్మలమ్మ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. కూరగాయల ఉత్పత్తి పెద్దఎత్తున చేపట్టేలా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, మహిళలు, బాలికల కోసం రూ.3 లక్షల కోట్లతో పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు.వచ్చే ఆర్థిక సంవత్సరానికి బీహార్‌లో వివిద ప్రాజెక్టుల కోసం రూ.26 వేల కోట్లు కేటాయించారు. అక్కడ ఎయిర్ పోర్టులు, విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారి బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు. విభజన తర్వాత ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటించి చేయూత అందించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పూర్తిగా సాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రైతులకు పోలవరం జీవనాడి అని.. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైనదని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వెంటనే జరిగేలా చూస్తామన్నారు.ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే, విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి సహకారం అందిస్తామని అన్నారు. హైదరాబాద్ – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *