ఆర్ అండ్ బి రోడ్లపై ఏర్పడిన పెద్ద గుంతలు.

పట్టించుకోని అధికారులు.

ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు.

సిరా న్యూస్,రుద్రవరం;

రహదారులు అభివృద్ధికి చిహ్నాలుగా చెప్పుకునే అధికారులు కొన్నిసంవత్సరాల క్రితం నిర్మించిన ఆర్ అండ్ బి రోడ్లు మరమ్మతులు చేపట్టకపోవడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నెలవుగా మారాయి. రుద్రవరం, ఆళ్లగడ్డ ప్రధాన రహదారిలో నరసాపురం వెళ్లే దారిలో రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. రుద్రవరం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఆర్ అండ్ బి రోడ్డుపై పెద్ద గుంతఏర్పడడంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ప్రధాన రహదారి వెంట అహోబిలం, మహానంది క్షేత్రాలకు వెళ్లి భక్తులు నిత్యం వాహనాలలో ప్రయాణిస్తుంటారు. గుంతను గమనించని వాహనదారులు అక్కడికి రాగానే ప్రమాదానికి గురికావాల్సి వస్తుంది. మోటార్ సైకిల్ పై వెళ్లే ప్రయాణికులు గుంత దగ్గర కిందపడి తీవ్ర గాయాల బారిన పడుతున్నారు. మరి కొంతమంది ప్రాణాలు వదులుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ గుంతల దగ్గర మరి కొంతమంది గాయాల బారిన పడకుండా ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత ఆర్ అండ్ బి అధికారులపై ఉందని ప్రయాణికులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *