వైసీపీలో టిక్కెట్ల అలజడి పక్క చూపులు చూస్తున్న నేతలు

సిరా న్యూస్,విజయవాడ;
ఎన్నికలకు ముందు ఓ రాజకీయ పార్టీపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ఆ పార్టీలో ఉండే చేరికల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగింది. టిక్కెట్లు రావని తెలిసినా చాలా మంది నేతలు చేరిపోయారు. దీనికి కారణం కాంగ్రెస్ అధికారంలోకి వస్తందని.. తమకు ఎమ్మెల్యే కాకపోతే మరో పదవి ఇస్తారని ఆశాభావం. ప్రజల్లో ఉన్న మూడ్ రాజకీయ నేతలకు కాక ఇంకెవరికి తెలుస్తుంది…?. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న నమ్మకంతో అన్ని రాజకీయ పార్టీలు కార్యకలాపాలు పెంచాయి.వ్యూహాత్మకమో.. వ్యూహాత్మక తప్పిదమో కానీ వైసీపీ చీఫ్ , సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాత్రికి రాత్రి పదకొండు స్థానాల్లో ఇంచార్జుల్ని మార్చేశారు. అంటే వారే అభ్యర్థులని చెప్పినట్లు. .మార్చింది కేవలం 11 చోట్ల మాత్రమేనని.. కానీ జాబితా వంద వరకూ ఉంటుందని సంకేతాలు పంపారు. ఇందులో పది మంది మంత్రుల పేర్లూ ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అందరిలోనూ ఆందోళన ప్రారంభమయింది. అధికారికంగా టిక్కెట్ రాదని తెలిసిపోయిన వారి అనుచరులు రాజీనామాల బటపట్టారు. అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు రాజీనామాలు చేశారు మోపిదేవి వంటి వారుసైలెంట్ అయిపోయారు. కానీ వారి అనుచరులు మాత్రం రాజీనామాల బాట పట్టారు. టిక్కెట్ రాదని కంగారు పడుతున్న నేతల సంఖ్య తక్కువేం లేదు. అలాంటి వారందరూ ఇప్పటికైతే సైలెంట్ గా ఉన్నారు. కానీ.. తెర వెనుక ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీలో చేరికలేమీ లేకపోగా.. ఉన్నవారు రాజీనామా చేస్తున్నారు. ముందు ముందు వైసీపీలో చేరే వారు కూడా ఉండే అవకాశం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తూండటం, మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం, తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం వంటి కారణాలతో ప్రతిపక్షానికి మంచి ఊపు వచ్చింది. అందుకే రోజు మార్చి రోజు.. ఆ పార్టీ కార్యాలయాలు సందడిగా మారుతున్నాయి. పార్టీలో చేరేందుకు వివిధ నియోజకవర్గాల నుంచి జిల్లాల వారీగా వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు వస్తున్నారు. గురువారం టీడీపీ , జనసేన కార్యాలయాల్లో జోరుగా చేరికలు జరిగాయి. కానీ మంగళగిరిలోని వైసీపీ కార్యాలయం ముందు మాత్రం ఎలాంటి సందడి లేదు. నిజానికి ఈ ద్వితీయ శ్రేణి నేతల్ని వారి గాడ్ ఫాదర్లే ముందస్తుగా.. టీడీపీ, బీజేపీల్లో చేరమని ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారమూ ఉంది. ముందు ముందు ఈ చేరికలు మరింతగా జోరందుకోనున్నాయి. వైసీపీలో వంద మందికి టిక్కెట్లు నిరాకరిస్తున్నారని తేలిపోవడంతో చంద్రబాబు నాయుడు టీడీపీ ఆఫీసులో వ్యూహాత్మక వ్యాఖ్యాలు చేశారు. మిచౌంగ్ తుపాను కారణంగా 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా రైతులకు రూపాయి సాయం చేయలేదని..కనీసం కేంద్రానికి నివేదికలు పంపలేదని చెప్పేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు .. వైసీపీలో పరిస్థితిపై వ్యూహాత్మకంగా మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *