ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
అగ్ని ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన నీలిమకు ఎమ్మెల్యే భరోసా..
అగ్ని ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న నీలిమకు అధైర్య పడొద్దు నేనున్నానంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. రాజీవ్ గృహకల్పనందు అగ్ని ప్రమాదానికి గురై తల్లిదండ్రులను కోల్పోయి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి దగ్గరకు బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి మొదటి నెల జీతంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని గురువారం అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారికి నేనున్నానని భరోసా ఇచ్చేందుకే తన భార్య కుమారుడితో కలిసి వెళ్లి సాయం అందించామని ప్రతి ఒక్కరూ ఇదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి మానసికంగా ఆర్థికంగా చేయూతనివ్వాలని సూచించారు. ఆ చిన్నారి వైద్యం నిమిత్తం ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి వెంట ఆయన సతీమణి అనురాధ, కుమారుడు రాజేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు.