సిరా న్యూస్,విశాఖపట్టణం;
ఏపీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రాజకీయ వ్యూహాల్లో రాజధాని ఇష్యూ అత్యంత కీలకం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అని .. వికేంద్రీకరణ అని రాజకీయం ప్రారంభించారు. నాలుగున్నరేళ్లు గడిచే సరికి ఆయన ఏ ఒక్క ప్రాంతానికీ వెళ్లలేకపోయారు. ఉన్న చోట నుంచి కదల్లేకపోయారు. విశాఖకు వెళ్లేందుకు ఎన్నో సార్లు ముహుర్తం ఖరారు చేసుకున్నా చివరికి ఆటంకాలు తప్పడం లేదు. డిసెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని చాలా సార్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు కూడా కనిపించం లేదు. ఓ వైపు రాజధాని పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంటే.. మరో వైపు ఆఫీసుల తరలింపుపై హైకోర్టులో కేసులు పడ్డాయి. అంతకు మించి క్యాంప్ ఆఫీస్ కోసం నిర్మించిన రుషికొండ ఇల్లు కూడా కోర్టు కేసుల్లో ఇరుక్కుంది. జగన్ రెడ్డి చేస్తున్న రాజధాని రాజకీయంలో ప్రతీ సారి ఎదురుదెబ్బలు తింటున్నారు. ముహుర్తాలు ఖారారు చేయడం ఆ సమయానికి వెళ్లలేకపోవడం అనేది కామన్గా మారిపోయింది. మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత నాలుగైదు నెలల్లోనే విశాఖ వెళ్లడానికి జగన్ సిద్ధమయ్యారు. అప్పటికీ మిలీనియం టవర్స్ ను ఖాళీ చేశారు. చాలా వరకూ ఆఫీసులు చూసుకున్నారు. కానీ మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పాస్ అయినా మండలిలో సెలక్ట్ కమిటీకి వెళ్లడంతో సమస్య వచ్చింది. తర్వాత కోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఓ వైపు అమరావతి రైతుల ఉద్యమం.. మరో వైపు కోర్టులో వాదలు.. ఇలా కాలం గడిచిపోయింది. చివరికి హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించి.. రాజధానిని మార్చే అధికారం లేదని తేల్చేసింది. దాంతో చట్ట పరంగా విశాఖకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే రాజధాని అనే పేరు లేకుండా.. విశాఖలో క్యాంప్ ఆఫీస్ ప్రారంభించడానికి సీఎం జగన్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఈ మూడు రాజధానుల ఇష్యూను రగిలించి..సెంటిమెంట్ గా రాజకీయాల్లో పోరాడాలనుకున్నారు. అయితే చివరికి డిసెంబర్ ప్రయత్నాలూ విఫలమయ్యాయి. మూడు రకాల కేసులు ప్రస్తుతం రాజధాని అంశంలో జగన్ నిర్ణయం తీసుకోలేకపోవడానికి కారణం అవుతున్నాయి. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నెల్లో విచారణ జరగాల్సి ఉంది. విచారణ ఎంత కాలం ఉంటుందో చెప్పడం కష్టం. ఆ కేసు ఇప్పుడల్లా తేలదు. అందుకే ఉత్తారంధ్ర అభివృద్ధి సమీక్ష పేరిట తన క్యాంప్ ఆఫీస్ మార్చాలనుకున్నారు. కానీ కోర్టులో కేసులు పడ్డాయి. ఇప్పుడు ఆ పిటిషన్లు తేలే వరకూ తరలించేది లేదని కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. అదే సమయంలో కనీసం ముఖ్యమంత్రి అయినా క్యాంప్ ఆఫీస్ మార్చుకోవడానికి ప్రయత్నించినా సాధ్యం కాదు. రుషికొండపై కట్టిన విలాసవంతమైన భవనం .. అక్రమ నిర్మాణం అని.. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని కోర్టులో కేసు నడుస్తోంది. అనుమతించిన దాని కన్నా ఎక్కువే తవ్వేశామని ప్రభుత్వమే ఒప్పుకుంది. అంటే అక్కడ ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘన జరిగింది. నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది.