సిరా న్యూస్,హైదరాబాద్;
కార్వన్ నియోజకవర్గంలోని కూల్సుంపుర లో జిల్లా పరిషత్ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన చేసారు. జిల్లా పరిషత్ స్కూల్ లో ఉపాధ్యాయులు & విద్యార్థుల హాజరును పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. 10 వ తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు జరిగిన పాఠ్యాంశాల పై ఆరా తీసారు. ఈసారి పదవ తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక తరగతులను పరిశీలించి విద్యార్థులతో కింద కూర్చుండి వారితో మాట్లాడారు. వివిధ సబ్జెక్టు లలో వారిని ప్రశ్నించారు. విద్యార్థులకు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ పై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులకు బేసిక్ వర్డ్స్ కూడా సరిగా చెప్పకపోవడంతో ఉపాధ్యాయులు పిల్లలకు బేసిక్ ఇంగ్లీష్ పై పట్టు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నూతనంగా నిర్మితమవుతున్న పాఠశాల భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణానికి ఆలస్యం అవడానికి గల కారణాలపై ఇంజనీరింగ్ అధికారులను ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా రాష్ట్రంలో 1100 కోట్లతో 25 వేల స్కూల్ లకు మౌలిక వసతులు కల్పించామన్నారు. గత నెలలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు పూర్తయ్యాయని. ఏ స్కూల్ లో కూడా ఉపాధ్యాయుల కొరత లేదన్నారు. ప్రతి స్కూల్ కి ఉచిత విద్యుత్ అందివ్వడంతో పాటు శానిటేషన్ సిబ్బంది స్కావేంజర్స్ కోసం ప్రతి నెల ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నామన్నారు..
కల్సుంపుర స్కూల్ లో టాయిలెట్స్ సమస్య లేకుండా చూసుకుంటామని డ్రింకింగ్ వాటర్ ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు ఇంటి దగ్గర పిల్లల హోం వర్క్ చెపించడంతో పాటు టీవీ లకు దూరంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్వన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్ధిన్ ,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, డీఈవో రోహిణి ,కాంగ్రెస్ పార్టీ నేత ఉస్మాన్ బిన్ అల్ హజ్రీ ,తదితరులు పాల్గోన్నారు.