ప్రాణదాతల మాన ప్రాణాలకు భద్రత కరువా…

సిరా న్యూస్;
మనిషి రూపంలో ఉండే దేవుడే వైద్యుడు. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. కానీ మానవత్వం మంటగలిసి కనికరం అన్నదే లేకుండా.. అమానుషమే నీడలా వెంటాడి లేడీ డాక్టర్ల ప్రాణాలు తీస్తోంది. ప్రాణదాతల మాన ప్రాణాలకు భద్రత కరువైంది. సేఫ్టీ, సెక్యూరిటీ లేక ప్రతి క్షణం టెన్షన్ టెన్షన్ గా ఒత్తిడిలో డ్యూటీ చేస్తున్నారు లేడీ డాక్టర్లు. కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసు దేశాన్ని కుదిపేస్తోంది. ఆందోళనలు ఓవైపు, డాక్టర్ల సమ్మె మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాయి. కోల్ కతా డాక్టర్ కేసు సామూహిక హత్యాచారమా? సీబీఐ విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయా? అసలేం జరిగింది?ఆదివారాలు లేవు. ఆనందాలు అంతకన్నా లేవు. పర్సనల్ లైఫ్ మాటే లేదు. పేషెంట్ ప్రాణాలు కాపాడటమే విధి. వైద్య వృత్తిని చాలా పవిత్రంగా భావించే డాక్టర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మెంటల్ ప్రజర్, సేఫ్టీ, సెక్యూరిటీ వంటి సమస్యలు ఉన్నా.. వైద్య వృత్తిలోకి మహిళలు ఎక్కువగా వస్తున్నారు. అలా వృత్తిని నమ్మి ప్రాణాలను నిలబెట్టే ప్రాణదాతల ప్రాణాలకే రక్షణ లేకుండా పోతోంది. లేడీ డాక్టర్లకే కాదు మహిళలకు భద్రత కరువైపోయింది. కోల్‌కత్తా ఘటన ఇప్పటికీ ఓ మిస్టరీయే. ఆగస్టు 9న హత్యాచారం జరిగింది. ఇప్పటికి 10 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ ఈ కేసులో ఏ పురోగతి కనిపించడం లేదు. సీబీఐ విచారణ జరుగుతోందన్న ఒక్క సమాచారం తప్ప మరేమీ తెలియడం లేదు. అసలు ఎందుకు అత్యాచారం చేశారు..? ఆ అత్యాచారం చేసిన వ్యక్తి అక్కడికి ఎలా వచ్చాడు..? అంత దారుణంగా హింసించి చంపాల్సినంత కక్ష ఏముంది..? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. వీటిలో దేనికీ ఇంకా సమాధానం దొరకలేదు. ఇలా ఎన్నో “లేదు, కాదు” లు ఉండడం వల్లే పెద్ద కన్‌ఫ్యూజన్‌ ఏర్పడింది. ఎవరికి తోచిన “థియరీ” వాళ్లు చెబుతున్నారు.ట్రైనీ డాక్టర్‌తో పాటు పని చేసే వాళ్ల వర్షన్ మాత్రం ఈ కేసుని మలుపు తిప్పేలా కనిపిస్తోంది. ఆమెని టార్గెట్ చేసి చంపారన్నది వాళ్లు చెబుతున్న థియరీలోని సారాంశం. అదే ఎందుకు అని ప్రశ్నిస్తే వాళ్లు చెప్పిన సమాధానాలు సంచలనం కలిగిస్తున్నాయి. “ఓ సీనియర్ వల్ల నా కూతురు చాలా ఇబ్బంది పడింది” అని వెల్లడించారు. వాళ్లు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హాస్పిటల్‌లో ఏదో రాజకీయం జరిగి ఉండాలన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇక కొలీగ్స్ చెబుతున్న అంశాలూ కీలకంగా మారాయి. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితురాలి కొలీగ్స్ ఇదే పేరుని పదేపదే ప్రస్తావిస్తున్నారు. “ఇది కేవలం హత్యాచారం కేసు కాదు. అంతకి మించి ఇంకేదో కుట్ర ఉంది. ఆమె సెమినార్ హాల్‌లో ఒంటరిగా ఉందని ఆ వ్యక్తికి ఎలా తెలిసింది” అని ప్రశ్నిస్తున్నారు తోటి వైద్యులు. ఇక మరో సంచలన విషయం ఏంటంటే…హాస్పిటల్‌లో పెద్ద ఎత్తున డ్రగ్ రాకెట్‌ జరుగుతోంది, ఆ రహస్యాలన్నీ బాధితురాలికి తెలిసిపోయి ఉంటాయని అంటున్నారు. అందుకే..ఆ రహస్యాలు ఎక్కడ బయటపెడుతుందో అన్న భయంతో ఆమెని ఇంత దారుణంగా చంపేసి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు.అయితే…కొందరు ఆమెని కావాలనే టార్గెట్ చేసి ఎక్కువ గంటలు పని చేయించినట్టు చెబుతున్నారు. ఆమె డైరీలో కూడా ఈ వర్క్ ప్రెజర్‌ గురించి రాసుకున్నట్టు తల్లిదండ్రులు ఇప్పటికే వెల్లడించారు. ఒక్కోసారి 36 గంటల పాటు కంటిన్యూగా పని చేయాల్సి వచ్చింది. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్‌ కనిపించకుండా పోయాడు. సీబీఐ రంగంలోకి దిగాక ఆయనపై నిఘా పెంచింది. ఆ రాత్రి ఎక్కడున్నారని విచారిస్తోంది. ఆయన చెప్పిన వివరాలను, హాస్పిటల్‌లోని మిగతా వైద్యుల వర్షన్‌ని పోల్చుకుని చూసుకుంటోంది సీబీఐ. తెల్లవారుజామున 3-5 గంటల మధ్యలో ఈ హత్యాచారం జరిగినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఆ టైమ్‌ కూడా ఈ కేసుని ఛేదించడంలో కీలకంగా మారనుంది. జూనియర్ డాక్టర్ పై ఘటనలో ప్రచారం అవుతున్న విషయాలపై పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాల్లో ప్రచారం అవుతున్న విషయాల్లో చాలా వరకు నిజం కాదని, ఆ వదంతుల్లో వాస్తవం లేదని కోల్‌కతా పోలీసులు కొట్టిపారేశారు. డాక్టర్ పోస్టుమార్టం ప్రక్రియ మేజిస్ట్రేట్ ఎదుట జరగగా, వీడియో తీశారు. అయితే ఆమె శరీరంలో ఎక్కడా ఎముకలు విరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో లేదన్నారు కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినేశ్ గోయల్.. సామూహిక అత్యాచారం జరిగిందని, శరీరంలో దాదాపు 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. డాక్టర్ తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషన్ వల్లే చాలా వరకు వదంతులు పుట్టుకొచ్చాయన్నారు. వినేశ్ గోయల్ మాట్లాడుతూ.. ట్రెయినీ డాక్టర్ శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం గుర్తించారనేది నిజం కాదన్నారు. కొందరు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఈ కేసు వివరాలపై దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ట్రెయినీ డాక్టర్ ది “అసహజ మరణం”గా పోలీసులు కేసు నమోదు చేయడం సైతం వివాదాస్పదమైంది. ఆసుపత్రి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై కలకత్తా హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి ఫిర్యాదు రానప్పుడు అసహజ మరణం కేసు నమోదు చేయడం సాధారణ ప్రక్రియ అన్నారు. కేసు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తమపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆమె తల్లిదండ్రులు కొందరు అనుమానితుల పేర్లను సీబీఐకి ఇచ్చారని, కొన్ని సోషల్ మీడియా పోస్టులతో సహచర డాక్టర్లను అనుమానితులుగా ప్రచారం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే.. ఇప్పటివరకూ ఒక్క వాలంటీర్ సంజయ్ రాయ్ పేరు మినహా ఏ ఇతర అనుమానితుల పేర్లను రికార్డుల్లో పేర్కొనలేదు. నిందితుడైన వాలంటీర్ ను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.రాత్రివేళ ప్రభుత్వ ఆసుపత్రిలో పీజీ సెకండియర్ చదువుతున్న జూనియర్ డాక్టర్ విధుల్లో ఉన్నారు. కానీ అనూహ్యంగా మరుసటి రోజు ఉదయం 10 గంటలకు హాస్పిటల్ సెమినార్ హాలులో ఆమె అర్ధనగ్న స్థితిలో చనిపోయి కనిపించారు. దేశ వ్యాప్తంగా నిరసన, ఆందోళన జరగడంతో ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసిందినిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మహిళలను ఈ భయం ఇంకెన్నాళ్లు వెంటాడుతుంది? శారీరక దాడులు తప్పేది ఎప్పుడు? మహిళలకు గాంధీజీ కలలుకన్న స్వాతంత్ర్యం రానట్లేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *