సిరాన్యూస్,ఖానాపూర్
తమ్మునికి రాఖీ కట్టడానికి వచ్చి మృతి చెందిన అక్క రాళ్ల బండి చిన్నమ్మ
రాఖీ కట్టడానికి వచ్చిన అక్క మృతి చెందింది. సంతోషంగా తమ్మునికి రాఖీ కట్టక ముందే కాటికి బయలుదేరింది. ఈ ఘనటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఖానాపూర్ ఎస్ఐ జి. లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం…నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన రాళ్ల బండి చిన్నమ్మ(70) వృద్దురాలు
ఆదివారం దిలావర్పూర్ గ్రామంలోని తన తమ్ముడు రసమల్ల బద్దయ్య ఇంటికి రాఖీ కట్టడానికి వచ్చింది. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో రాళ్ల బండి చిన్నమ్మ దిలావర్పూర్ గ్రామ శివారులో ఉన్న సదర్ మార్ట్ లెఫ్ట్ కెనాల్ వద్ద కాలకృత్యాలు కోసం వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు ఆమె కాలుజారి కెనాల్ లో పడిపోయింది. అనుమానం వచ్చిన బంధువులు ఆమెను వెతుకుతుండగా పాత ఎల్లాపూర్ గ్రామ శివారులో గల సైఫన్ గేటు వద్ద ఆమె మృతదేహం లభించింది. మృతురాలికి ముగ్గురు కుమారులు కాగా ఒక కొడుకు చనిపోయాడు. ఒక కొడుకు విదేశాలలో ఉన్నాడు. ప్రస్తుతం తన రెండవ కొడుకు రాళ్ల బండి ముత్తన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.