సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రజా రక్షణ చర్యలపై అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
* భారీ వర్షాలపై కలెక్టర్లతో సమీక్షా
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో ప్రాణ ,ఆస్తి నష్టం జరగకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవిన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం అయన ఖమ్మం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో భారీ వర్షాలు, ధరణి,నూతన రెవిన్యూ చట్టంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న 5 రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ,అందువల్ల జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండడంతో పాటు, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ,ముఖ్యంగా ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. వర్షాల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని ,ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, స్థానిక పరిస్థితుల ఆధారంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చేయాలని అన్నారు. ప్రస్తుత రెవెన్యూ చట్టంలో మార్పులతో తీసుకురానున్న కొత్త రెవిన్యూ చట్టంపై ఈనెల 23 ,24 తేదీలలో జిల్లా స్థాయిలో వర్క్ షాప్ నిర్వహించి మేధావులు, సీనియర్ సిటిజన్ల అభిప్రాయాలను తీసుకొని రాష్ట్ర స్థాయికి పంపించాలని ఆయన కోరారు ధరణి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్లు పెండింగ్లో ఉన్న అన్ని ధరణి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను వేగవంతం చేయాలని,గతంలో ఏవైనా డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనట్లయితే ఇప్పుడు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉన్నందున అలాంటి వాటినిగుర్తించి అప్లోడ్ చేయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ రానున్న 5 రోజులపాటు, భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సాగునీటి ట్యాంకులు , చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలు, కల్వర్టులు పొంగి ప్రవహిస్తున్న చోట ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అవసరమైతే ట్రాఫిక్ ను మళ్ళించాలని తెలిపారు. ఈ నెల 25 వరకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసిందని అన్నారు. పరిస్థితులను బట్టి ఆయా జిల్లాలలో పాఠశాలల ను మూసి వేయడం లేదా నడిపించడం చేయాలని అన్నారు .రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆదేశాల మేరకు రానున్న కొత్త రెవిన్యూ చట్టంపై ఈ నెల 23 ,24 తేదీలలో వర్క్ షాప్ లు నిర్వహించాలని ఆదేశించారు .పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులు అన్నింటిని ఒక కొలిక్కి తీసుకురావాలని, ఎక్కడైనా సందేహాలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఇతర అధికారులు రాష్ట్రస్థాయి నుండి హాజరు కాగా, జిల్లా నుండి జిల్లా పాలనాధికారి రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ట్రైనీ కలెక్టర్ అబిగ్యా న్ మాలవియ, ఆర్డీఓ వినోద్ కుమార్, జివాకార్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ చౌహాన్, మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.