సిరా న్యూస్,విజయవాడ;
అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో జోగి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. భూముల వ్యవహారంలో ఫోర్జరీ కోణం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. రేపో మాపో జోగి రమేష్ ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతోంది సీఐడీ.జోగి రమేష్కి తాను స్థలం అమ్మలేదని సీఐడీకి వాంగ్మూలం ఇచ్చారు సంబంధిత వ్యక్తి పోలవరపు మురళీమోహన్. డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు తనవి కావని అంటున్నారాయన. వాస్తవానికి సర్వేనెంబరు 88లో 4 ఎకరాలు వెంటకచలమారెడ్డి పేరుపై ఉంది. అందులో ఓ ఎకరం పోలవరపు మురళీమోహన్, మరొకటి అద్దెపల్లి కిరణ్ కుమార్కు.. రెండు ఎకరాలు రామిశెట్టి రాంబాబుకు 2001లో విక్రయించారుపోలవరపు మురళీమోహన్ తన ఎకరం స్థలాన్ని ప్లాటులుగా విభజించి 2003, 2004లో 11 మందికి విక్రయించాడు. పోలవరపు మురళీమోహన్.. జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్లకు ల్యాండ్ విక్రయించిన ట్టు రెండేళ్ల కిందట రిజిస్ట్రేషన్లు అయ్యాయి.దర్యాప్తు అధికారులు పోలవరపు మురళీమోహన్ను నిందితుడిగా చేర్చారు. అధికారుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జోగి కుటుంబానికి తాను భూములు అమ్మలేదని, ఆ డాక్యుమెంట్లు తనవి కావని వెల్లడించాడు. అంతేకాదు ఆధార్ కార్డు నెంబరు తన కాదని వివరణ ఇచ్చాడు. సర్వే చేసే సమయంలో సంబంధిత భూమి సరిహద్దుల్లో ఉన్న యజమానులకు నోటీసులు ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది. వీటిపై కూడా ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ లెక్కన జోగి ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ యవ్వారంలో తీగ లాగితే డొంక అంతా కదులుతోంది.