కోవర్టు నెపంతో మహిళా మావోయిస్టు హత్య

సిరా న్యూస్;

– తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఘటన

– చర్ల మండలంలో మృతదేహాన్ని వదిలేసిన మావోలు

– మృతదేహం వద్ద పార్టీ తరఫున లేఖ

: ఓ మహిళా మావోయిస్టును పోలీసు కోవర్టుగా ముద్ర వేసిన మావోయిస్టులు దారుణంగా హతమార్చారు…

ఈ ఘటన తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీసాన చోటుచేసుకుంది…

మావోయిస్టు పార్టీకి చెందిన పల్లెపాటి రాధ అలియాస్‌ నీల్సో(26) పోలీసు కోవర్టుగా వ్యవహరిస్తోందనే నెపంతో మావోయిస్టులు హతమార్చారు…

మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున చర్ల మండలం చెన్నాపురానికి వెళ్లే దారిలో గల సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు సమీపాన వదిలేశారు. మృతదేహం వద్ద మావోయిస్టు పార్టీ ఆంధ్ర – ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేష్‌ పేరిట ఒక లేఖ కూడా ఉంచారు…

ఈ మేరకు పోలీసులు ఆమె మృతదేహానికి భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో శవ పంచనామా చేయించాక కుటుంబ సభ్యులకు అప్పగించారు….

కాగా, రాధ మెడకు ప్లాస్టిక్‌ తాడు కట్టి చెట్టుకు లాగడం ద్వారా ప్రాణం తీసినట్టు తెలుస్తోంది. మావోలు ఉద్యమంలో చేరిన నీల్సోను బయటకు తీసుకురావడానికి ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులు తీవ్రమైన ఒత్తిడి చేశారని, ఈ క్రమంలోనే ఆమె తమ్ముడు సూర్యాన్ని ఉద్యోగం పేరుతో పోలీసులు లొంగదీసుకున్నారని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు….

పోలీస్‌ ఏజెంట్‌గా మారిన సూర్యం తన అక్క నీల్సో ద్వారా మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలకు అందించాడని ఆరోపించారు. నీల్సో వ్యవహార శైలి నచ్చక మూడు నెలల క్రితమే కమాండర్‌ బాధ్యతల నుంచి తప్పించామని తెలిపారు….

ఆ తర్వాత ప్రజాకోర్టు నిర్వహించగా చేసిన తప్పులను రాధ అంగీకరించిందని.. ఫలితంగా ఆమెకు మరణశిక్ష విధించామని ప్రకటించారు…

హేయమైన చర్య : ఎస్పీ రోహిత్‌ రాజు

మావోయిస్టు పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న దళిత యువతి బంటి రాధ ఆలియాస్‌ నీల్సోను అతి కిరాతకంగా చంపడం హేయమైన చర్య అని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు…. సామాజిక న్యాయమంటూ మాటలు చెప్పే మావోయిస్టులు ఇతరులను వదిలేసి కేవలం దళితురాలైన రాధను ఎందుకు చంపారో సమాధానం చెప్పాలని సూచించారు.

రాధ అలియాస్‌ నీల్సో ప్రస్థానం..

మావోయిస్టు చేతిలో హతమైన రాధ స్వస్థలం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్‌ పరిధి న్యూ ఇందిరానగర్‌ కాలనీ. ఎస్సీ (మాదిగ) సామాజివర్గానికి చెందిన పల్లెపాటి బాలయ్య, బాలమ్మ దంపతుల కుమార్తె రాధ 2017లో డీఎంఎల్‌టీ(యూజీ) పూర్తి చేసింది. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై 2018లో పార్టీలో చేరింది. ఆ తర్వాత అంచెలంచెలుగా జోన్‌ మిలటరీ ఇన్‌స్ట్రక్టర్‌గా, సెంట్రల్‌ కమిటీ సభ్యులకు రక్షణ దళం సభ్యురాలిగా పనిచేసింది. చివరగా ఏఓబీ ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉండగా కోవర్టు ఆరోపణలతో మావోయిస్టుల చేతిలో హతమైంది. ఆమెపై రూ.4 లక్షల పోలీసు రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *