సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చుతాం అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటతో మార్పు మొదలైంది. ఉక్కుపాదం మార్క్ కన్పిస్తోంది. డ్రగ్స్, గంజాయి బ్యాచ్ల బెండు తీస్తున్నారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్టంగా చేయాలన్న సర్కార్ సంకల్పానికి అనుగుణంగా లా అండ్ ఆర్డర్ పోలీసు,, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్.. టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో త్రిశూల్ ఆపరేషన్ కేటుగాళ్ల వెన్నులో వణుకు రేపుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు సహా జిల్లాల్లోనూ డ్రగ్ నెట్ వర్క్కు కళ్లెం పడుతోంది. టీవీ9తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో సంచలనాల అంశాలను ప్రస్తావించారు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య. నివేదికల ప్రకారం తెలంగాణ కొకైన్ వాడకంలో మూడో స్థానంలో.. గంజాయి వాడకంలో ఐదో స్థానంలో ఉందన్నారు. 40 వేల మంది కొకైన్కు ఎడిక్టయిన వాళ్లున్నారన్నారు..డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా కావాలంటే ముందుగా స్కూళ్లు, ఇంజినీరింగ్,మెడికల్ కాలేజీలు, వర్సిటీ క్యాంపస్లను డ్రగ్ ఫ్రీ చేయాల్సిన అవసరం వుందన్నారు. అలాగే పల్లెబాటలో కూడా డ్రగ్స్ కట్టడిపై సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం వుందన్నారు. తెలిసో తెలియకో డ్రగ్ మాఫియా ట్రాప్లో పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంతో భవిష్యత్ వున్న పిల్లలు డ్రగ్స్కు బానిసవరం చూస్తే బాధేస్తుందన్నారు.అలాంటి వారిలో పరివర్తను తీసుకురావడం ముఖ్యమన్నారు. ఆదిశగా చర్యలు చేపడుతున్నామన్నారు సందీప్ శాండిల్య.డ్రగ్స్,గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. తనిఖీల్లో భారీగా సరుకుపట్టుపడుతోంది. అరెస్టులతో పాటు కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. రెండేళ్లలో తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం టీవీ9 చేస్తోన్న కృషిని ఆయన అభినందించారు. తెర వెనుకనైనా సరే పబ్ల్లో నైనా సరే..పల్లెబాటలో నైనా సరే ఎక్కడ డ్రగ్స్ వాడిన మక్కెలిరగొట్టి జైలుపాలు చేయడం ఖాయం. . డ్రగ్స్ కొన్నా అమ్మినా బట్వాడా చేసిన వాడినా ఇట్టే గుర్తించేలా ప్రపంచంలోనే అత్యున్నతమైన టెక్నాలజీ తెలంగాణలో అందుబాటులో ఉందిప్పుడు.హైదరాబాద్ మహానగరాన్ని గంజాయి విముక్త నగరంగా మార్చేందుకు అటు ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ అధికారులు ఇటు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా నడుం బిగించారు. వాళ్లు చేపట్టిన ఆపరేషన్ ధూల్పేట్ సత్ఫలితాలు ఇస్తోంది. గంజాయికి అడ్డాగా మారిన ధూల్పేట్ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చడానికి అధికారులు వరుస దాడులు జరుపుతున్నారు. దీంతో గంజాయి ముఠాలు హడలెత్తిపోతున్నాయి. ఆపరేషన్ ధూల్పేట్ ముగియడానికి మరో పది రోజుల టైమ్ ఉన్నా…అంతకుముందే అక్కడినుంచి పెట్టెబేడా సర్దుకుని పారిపోతున్నాయి గంజాయి మాఫియా గ్యాంగ్స్.
గంజాయి మాఫియా గడ్డ ధూల్పేట్..!
హైదరాబాద్లో గంజాయి మాఫియా గడ్డ ధూల్పేట్. దాని అడ్డాగానే నగరం అంతటా గంజాయి అమ్మకాలు జరుగుతుంటాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. పోలీసులు.. సీరియస్ యాక్షన్ ప్లాన్తో రంగంలోకి దిగడంతో గంజాయి సరఫరాదారులు ధూల్పేట్ వదిలి పారిపోతున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ధూల్పేట్కు వెళ్లి మరీ అక్కడ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. అయితే ధూల్పేట్ కేంద్రంగా స్థానికుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో బయటపడింది.ఆగస్టు 1న మొదలు పెట్టిన ఈ స్పెషల్ డ్రైవ్, ఈ నెలాఖరు దాకా సాగుతుంది. ధూల్పేట్లో గంజాయి ముఠాల డేటా మొత్తం సేకరించిన తర్వాతే దాడులు మొదలు పెట్టారు అధికారులు. ఇదే క్రమంలో గత 20 రోజుల్లో 29 కేసులు నమోదు చేసి 98.6 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 106మంది గంజాయి దందాలో పాల్గొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 63మందిని అరెస్ట్ చేయగా 53మంది పరారీలో ఉన్నారు. వాళ్లను అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. నిత్యం ఇదే దందాలో మునిగి తేలుతున్న 28మందిని బైండోవర్ చేసి, 43మందిపై చార్జిషీట్ను ఫైల్ చేశారు అధికారులు.
అజ్ఞాతంలోకి గంజాయి బ్యాచ్
ధూల్పేట్లోని గంజాయి గ్యాంగుల్లో 250మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆపరేషన్ ధూల్పేట్ ప్రారంభం కాగానే…వాళ్లలో సగం మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. వీళ్లు తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉండడంతో…ధూల్పేట్పై నిరంతర నిఘా పెట్టాయి ఎక్సైజ్ వర్గాలు. ఈ నెలాఖరు కల్లా ధూల్పేట్లో గంజాయి దందా ఖేల్ ఖతం చేయడానికి పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నారు అధికారులు