నిజాయితీకి పోతే… ఇబ్బందులే.

సిరా న్యూస్,వరంగల్;
వ‌రంగ‌ల్ ఇరిగేష‌న్‌ సీఈ ప‌రిధిలోని డీఈ హోదా అధికారి గోపికృష్ణ ఏడాదిన్నర కాలంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2007లో ఇంజ‌నీరింగ్ శాఖ‌లో చేరిన గోపికృష్ణకు డిపార్ట్‌మెంట్‌లో నిజాయితీప‌రుడిగా పేరు ఉంది. విజిలెన్స్, ఏసీబీ అధికారుల నివేదిక‌ల అనంత‌రం గోపికృష్ణను ఉన్నతాధికారులు 2016 మే 3న వ‌రంగ‌ల్ యూనిట్‌లోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈగా నియ‌మించారు. వ‌రంగ‌ల్ యూనిట్(ఉమ్మడి వ‌రంగ‌ల్‌, ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాల ప‌రిధిలో)లో చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఆయ‌న స‌మ‌ర్థవంత‌మైన ప‌నితీరుతో కాంట్రాక్టర్లు, అధికారుల ఆట క‌ట్టించారు. టీఆర్ఎస్ తొలి విడ‌త ప్రభుత్వంలో నీటిపారుద‌ల శాఖకు సంబంధించిన కీల‌క ప్రాజెక్టులు అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. రెండు ఉమ్మడి జిల్లాల్లో మిష‌న్ కాక‌తీయ ప్రొగ్రాంలో జ‌రిగిన అవినీతి, అక్రమాల‌పై గోపికృష్ణ రిపోర్టు చేయ‌డంతో కొంత‌మంది అధికారులు స‌స్పెన్షన్‌కు గుర‌య్యారు. దాదాపు రూ. 50 కోట్ల ప‌నుల‌కు సంబంధించిన కాంట్రాక్టర్ల ప‌నుల్లో అవినీతి వెలుగులోకి రావ‌డంతో పెద్ద ఎత్తున రిక‌వ‌రీ చేయించ‌గ‌లిగాడు. మొత్తంగా ప‌నిచేసిన నాలుగేళ్లలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈగా త‌న ముద్రను వేయ‌గ‌లిగారు.విజిలెన్స్ డీఈగా నిజాయితీగా వ్యవ‌హ‌రించిన గోపికృష్ణపై మూడేళ్లుగా వివ‌క్ష, క‌క్ష సాధింపు కొన‌సాగుతున్నట్లుగా ఆ శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. 31-07-2020 వ‌ర‌కు వ‌రంగ‌ల్ యూనిట్‌లోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈగా కొన‌సాగిన గోపికృష్ణను ఆ త‌ర్వాత ఇరిగేష‌న్ డిపార్ట్‌మెంట్‌కు బ‌దిలీ చేశారు. గోపికృష్ణ ఈఎన్‌సీకి రిపోర్ట్ చేశారు. ఈఎన్‌సీ హైద‌రాబాద్‌లో పోస్టింగ్ ఇవ్వాల‌ని సీఈసీడీవో(చీఫ్ ఇంజ‌నీర్‌, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేష‌న్‌)కు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అయితే గోపికృష్ణ తాను చెప్పిన‌ట్లుగా న‌డుచుకోలేని ఉద్దేశంతో ఓ ఉన్నతాధికారి ప‌నిగ‌ట్టుకుని మ‌రీ పోస్టింగ్ దాదాపు ఖ‌రారైన అయిన స‌మ‌యంలో ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. నీటిపారుద‌ల శాఖలోని వ్యవ‌స్థల‌న్నీ ఒకే గొడుగు కింద‌కు ప్రభుత్వం తీసుకువ‌చ్చింది. రీ ఆర్గనైజేష‌న్ చేసిన త‌ర్వాత ములుగు ఇరిగేష‌న్ సర్కిల్‌లో ఆఫీసులో 2021లో ఫిబ్రవ‌రిలో డీఈగా పోస్టింగ్ ఇచ్చారు. ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టులో కూర్చుబెట్టారు. 2023 సంవ‌త్సరంలో జులైలో విజిలెన్స్‌లో డీఈగా పోస్టింగ్‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న ర‌విగుప్తాకు గోపికృష్ణ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.గోపికృష్ణను విజిలెన్స్ ప‌రిధిలోకి పంపివ్వడానికి ఆదేశాలివ్వాల‌ని కోరుతూ అప్పటి స్పెష‌ల్‌ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ ర‌జ‌త్‌కుమార్‌కు ర‌విగుప్తా లేఖ రాశారు. గోపికృష్ణను విజిలెన్స్ డీజీ ప‌రిధిలోకి బ‌దిలీ చేస్తున్నట్టు ఆదేశిస్తూ.. 12 సెప్టెంబ‌ర్ 2023 ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ ర‌జ‌త్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా 13-09- 23న రిలీవ్ అయ్యారు. 14న విజిలెన్స్ డీజీకి రిపోర్ట్ చేశారు. 15న ఆర్డర్‌ను క్యాన్సిల్ చేస్తూ స్పెష‌ల్ సీఎస్ మ‌ళ్లీ ఉత్తర్వులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో త‌న‌కు న్యాయం చేయాలంటూ గోపికృష్ణ 09-10-23న హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆయ‌న‌కు ఇరిగేష‌న్ శాఖ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. స‌ర్వీసులో తాను ఉన్నట్లో లేన‌ట్లో అర్థం కావ‌డం లేద‌ని డీఈ గోపి ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో ఇప్పుడైనా త‌న‌కు న్యాయంజ‌రుగుతుంద‌నే ఆశ‌తో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *