గాయత్రి విద్యానికేతన్ లో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

సిరా న్యూస్,పెద్దపల్లి;
పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో అందంగా ముస్తాబై వచ్చి అందరినీ అలరించారు. అనంతరం పలు శ్రీ కృష్ణుని భక్తి గీతాలపై పలువురు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పండగ విశిష్టతను గూర్చి పాఠశాలకు చెందిన 9 వ తరగతి విద్యార్థినులు పూరెళ్ళ హన్విత, చంద్రకారి లయవర్థిని లు ఇచ్చిన ఉపన్యాసాలు పండగ గొప్పదాన్ని అందరికీ తెలిపాయి. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ ద్వాపర యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణం మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని శ్రీమహావిష్టువు ఎనిమిదో అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారని వివరించారు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనదని, అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారని అన్నారు. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, అయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలని తెలిపారు. ప్రతి విషయంలోనూ స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైనా విడనాడి మానవజన్మకు సార్థకతని ఏర్పరచుకోవాలని కోరారు. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనులలోను అర్థం పరమార్థం కనిపిస్తాయన్నారు. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు అనీ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమం చిన్నారులు కేరింతల మధ్య ఆహ్లాదభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ దంపతులు పాల్గొని పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, పోషకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *