ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

సిరా న్యూస్,ఆదిలాబాద్ :

ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి..  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .. 

మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యలపై వచ్చిన అర్జీదారుల దరఖాస్తులను ఆయన స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 21 న హైదరాబాదులో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం ఉన్నందున జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించి సంక్షిప్త సమాచారాన్ని రేపటి లోగా అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పదవతరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *