రేవంత్ కుసపోర్ట్ గా నెట్ జన్లు

సిరా న్యూస్,హైదరాబాద్;
చెరువుల పరిరక్షణ, అక్రమ కబ్జాలపై హైడ్రా పేరుతో సీఎం రేవంత్ జూలిపిస్తున్న కొరడాకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అటు పొలిటికల్‌గా.. ఇటు సామాన్యుల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోంది. బడాబాబుల ఒత్తిళ్లకు తగ్గేదేలేదంటున్న రేవంత్‌కు.. ఎన్-కన్వెన్షన్ కూల్చివేత హైడ్రాకు కావాల్సినంత మద్దతును కూడగట్టింది. చెరువుల పరిరక్షణకు హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందించారు. హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తారించాలని సీఎం రేవంత్‌కు ఆయన లేఖ రాశారు.చెరువుల పరిరక్షణ, చెరువుల్లో కబ్జాలు, ఆక్రమణలు తొలగించేందుకు సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన హైడ్రాపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాపై ఎమ్మెల్యేలంతా రేవంత్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ హైడ్రా తరహా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సీఎంకు రాసిన లేఖలో కోరారు. భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం ఆక్రమించి, వెంచర్లు, లేఅవుట్లు వేసి చెరువులను ధ్వంసం చేస్తున్నారని ఆయన అన్నారు.ఈ ఆక్రమణలతో చెరువులు, కుంటలు రూపం కోల్పోయి, నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి, ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గంలో 70 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉందని, ఇరువైపులా ఉన్న చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయని అన్నారు. వాటిని పరిరక్షించేందుకు, ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వీరేశం కోరారు. తన నియోజకవర్గంలో నిజాం కాలం నుంచి ఉన్న గొలుసుకట్టు చెరువులను ఆక్రమణదారులు ధ్వంసం చేసి రూపం లేకుండా చేశారని చెప్పారు. పూర్వం రోజుల్లో యేరు వచ్చి ఊరుమీదపడి ఊరు మునిగిందని వినేవారమని, అయితే ఇప్పుడు ఆక్రమణలో ఊరే చెరువుల్లోకి వెళ్లిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. దీన్ని సరిచేసేందుకు సీఎం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువులకు పునర్జీవం పోయాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *