సిరాన్యూస్, చిగురుమామిడి
సమస్యల వలయంలో చిగురుమామిడి కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం
* విద్యార్థినిలకు అందని బెడ్స్, వస్తు సామాగ్రి
* విరిగిపోయిన బాత్రూం డోర్ గడియలు
* కరెంటు వాటర్ హీటర్ లేక ఇబ్బందులు
* పట్టించుకోని అధికారులు,ప్రజాప్రతినిధులు
* ఇబ్బందులు పడుతున్న విద్యార్థినిలు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. అవసరమైన వస్తు సామాగ్రి, తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విద్యాశాఖ పూర్తిగా వైఫల్యం చెందింది.వసతి గృహంలో మొత్తం 162 మంది బాలికలు చదువుతున్నారు. ప్రతిరోజు బాలికలు స్నానం చేయడానికి ఒకే ఒక సోలార్ హీటర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం వానకాలం కావడంతో సరిపడ ఎండ లేకపోవడంతో బాలికలకు సరిపడా వేడి నీళ్లు అందుబాటులో రావడం లేదు. చన్నీలతోనే విద్యార్థులు స్నానం చేస్తూ కాలం వెలదీస్తున్నారు.6వ తరగతి విద్యార్థులు చన్నీలతో స్నానం చేయడానికి ఇబ్బందులు పడుతూ కొన్ని సందర్భాల్లో జ్వరాల బారిన పడిన పరిస్థితులు ఉన్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. కరెంటుతో నడిచే వేడి నీళ్ల హీటర్ మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. వసతి గృహంలో 162 మంది విద్యార్థులకు పడుకోవడానికి ఇంతవరకు బెడ్స్ కూడా మంజూరు కాకపోవడం నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది. విద్యార్థులందరూ నేల మీద పడుకుంటున్నారు. బాత్రూం డోర్లకు ఘడియలు ఊడిపోయాయి. ఇంతవరకు గడియలు బిగించలేదు. విద్యార్థులకు అందాల్సిన ట్రంక్ పెట్టెలు, ఇతర సామాగ్రి ఇంతవరకు ఇవ్వలేదు. వసతి గృహానికి సంవత్సరాలు గడుస్తున్న పెయింటింగ్ వేయలేదు. అత్యవసర సమయాల్లో బాలికలకు అనారోగ్య సమస్యలు తలెత్తితే తరలించడానికి ప్రత్యేక వాహనం కూడా లేదు. బాలికల నిర్వహణ ఖర్చు కింద ప్రతినెల 750 రూపాయలు కేటాయిస్తారు. ప్రతిరోజు 50 రూపాయలు ప్యాకెట్ ఖర్చుల కింద అందజేస్తారు ఇవి ఎంతవరకు అమలవుతున్నాయో తెలియని పరిస్థితి. తమ సమస్యలకు పరిష్కరించి న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వసతి గృహంలోని సమస్యలు పరిష్కరించాలి : ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ తాళ్ల నరేష్
బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ మధ్యతరగతి పేద బాలికల వసతి గృహంలో సౌకర్యాలు కల్పించడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా పైఫల్యం చెందారు. ప్రభుత్వం అధికారులు స్పందించి వసతి గృహంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.ఇటీవల కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నామన్నారు.