సిరాన్యూస్, కరీంనగర్
నేత్రదానం యజ్ఞంలా సాగాలి : సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్
శరీర, అవయవ దానాలపై అపోహలు వద్దు
మరణానంతరం నేత్రాలు,అవయవాలు, శరీరం మట్టిలో వృధాగా కలసి పోనివ్వ కుండా దానం చేసి మానవ మనుగడకు తోడ్పడాలని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ కోరారు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని బుధవారం కరీంనగర్ కిమ్స్ విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్ అర్జున్ రావు అధ్యక్షతన సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర, అవయవ ,శరీర దానాలపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.నేత్రదానం అంటే మొత్తం కనుగుడ్డు తీయడం కాదని ,కన్ను పైన ఉన్న పల్చని “కార్నియా ” అనే పొర మాత్రమేనని అన్నారు. మరణించిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా ఇంటి వద్దనే తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్నియా మార్పిడి కోసం 15 లక్షలకు పైగా అంధులు వేచి తెలిపారు. అందులో 60 శాతం మంది 12 సంవత్సరాల లోపు బాల,బాలికలు ఉండడం అత్యంత విషాదకరమన్నారు. ఈ పరిస్థితుల్లో నేత్రదానం ఒక యజ్ఞంలా కొనసాగాలని, ప్రతి ఒక్కరు పెద్ద మనస్సుతో ,మానవతా దృక్పథంతో ఆలోచించి మరణానంతరం నేత్రదానం చేసి మానవ జన్మను చరితార్థం చేసుకోవాలని కోరారు .అవయవ, శరీర దానాలపై అపోహలు తొలగించి, సమాజంలో వాటికున్న అవశ్యకత వివరించారు..ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు మాట్లాడుతూ సదాశయ ఫౌండేషన్ గత 16 సంవత్సరాలుగా అవయవ, శరీర దానాలపై విశేష కృషి చేస్తుండడంఅభినందనీయం అన్నారు.తమ సేవలతో ఎందరో అంథులకు వెలుగులు ప్రసాదించారని వారన్నారు.మార్కెట్టులో కోట్లు పోసినా లభించని శరీరభాగాలు,మరణాంతరం మట్టిలో వృధా పోనీయకుండా దానం చేసి మానవ మనుగడకు తోడ్పడి మానవజన్మ సార్ధకం చేసుకోవాలని కోరారు.