సిరాన్యూస్, ఆదిలాబాద్
ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవు: ఎస్పీ గౌష్ ఆలం
జైనూర్ సంఘటన దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. అనుమతులు లేకుండా గుమిగూడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. అదిలాబాద్ జిల్లా లోని అన్ని మండలాల నందు 163 బీఎన్ఎస్ఎస్సెక్షన్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని తెలిపారు. అన్ని మండలాలలో బంద్ ఉందంటూ ప్రచారం చేసిన, బంద్ చేయడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రస్తుతం జైనూరు మండలం ప్రశాంత వాతావరణంలో ఉందని తెలిపారు. జైనూరు సంఘటన నందు కారకులపై కేసులు నమోదు చేయబడం జరిగిందని, దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలెవరు గుంపులు గుంపులుగా తిరగడం, అనవసరంగా బయటకు రావడం చేయరాదని తెలిపారు. ఉద్రిక్తతలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తగా చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఇతరులను జైనూర్ లోనికి అనుమతించడం జరగదని తెలిపారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులు నమ్మవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేసే వారిపై, గ్రూప్ అడ్మిన్ లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.