అటో.. ఇటో పరిస్థితి
సిరా న్యూస్,హైదరాబాద్;
ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు.. నేతల గోడ దూకుళ్ళు సర్వసాధారణం.. ఈ తంతు ఎన్నికలు పూర్తై, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అడపా దడపా జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో అయితే.. ఈ వ్యవహారాన్ని జనాలు సైతం చాలా లైట్గా తీసుకుంటున్నారు. కానీ గోడదూకిన ఎమ్మెల్యేలు… అటో, ఇటో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడటం ఏదైతే ఉందో… అదేఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని నిప్పుల కుంపటిలా ఉడికిస్తోంది. కండువా మార్చి, ప్రభుత్వంలో కీలక పదవి దక్కించుకున్న ఆ జంపింగ్ ఎమ్మెల్యేకి.. తాను ఏ పక్షాన ఉన్నానో కూడా చెప్పుకునే పొజిషన్ లేకుండా పోయిందట.తెలంగాణలో మరోసారి ఫిరాయింపుల రాజకీయం రచ్చరేపుతోంది. ఇటీవల జరిగిన సీఎల్పీ భేటీలో… శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రత్యక్షమవడంతో.. ఈ వ్యవహారం మరోసారి టాప్న్యూస్లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ల మధ్య రచ్చ రాజకీయ వర్గాలలో తీవ్ర దుమారం లేపింది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఆరికెపుడు గాంధీ, ప్రకాష్ గౌడ్ లతోపాటు మొత్తం పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద లు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను కలసి వినతి పత్రం ఇచ్చినా ఆయన పట్టించుకోట్లేదని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదును విచారించిన కోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యాలయానికి సూచించింది. ఈ వ్యవహారంలో ఆరికెపుడు గాంధీ స్పందిస్తూ నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి అరికెపుడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని చెప్పడంతో, దమ్ముంటే మా ఇంటికి రావాలి.. లేదంటే నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరారు. అంతేకాు ఏకంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ అనుచరులతో ఇంటి మీద హంగామా చేశాడు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై ఆరికెపుడిగాంధీ స్పందించనప్పటికి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సీఎల్పీ సమావేశం జరిగిన మాదాపూర్ ప్రాంతం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని మార్యద పూర్వకంగా కలిశాడు. దానికి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఇదంతా ఒకెత్తైతే మాదాపూర్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ కి ఆరికెపుడు గాంధీ హాజరయ్యారు. ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనప్పుడు సీఎల్పీ సమావేశానికి ఎలా వెళతారనేది ప్రతిపక్షాల ఆరోపణ. హరీష్ రావు కూడా ఇప్పటికే కౌంటర్ స్టార్ట్ చేశారు.వివాదం నుంచి బయటపడేందుకు, తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకొన్న అరెకపూడి గాంధీ.. ఇప్పుడు సీఎల్పీ భేటీలో పాల్గొనడం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్లో చేరినట్టు గతంలో ఎక్స్లో పోస్టు చేసిందీ ఆయనే.. పబ్లిగ్గా ప్రకటించిందీ ఆయనే… ఆ తర్వాత పీఏసీ చైర్మన్ పదవి విషయంలో వివాదం చెలరేగడంతో తాను కాంగ్రెస్లో చేరలేదన్నదీ ఆయనే… ఇప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీకి హాజరైందీ ఆయనే.. కానీ, ఇప్పటికీ ఆయన అటో, ఇటో అన్నది మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తానెటువైపనే విషయాన్ని గాంధీ కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి. పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీతో పాటు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, డాక్టర్ సంజయ్కుమార్, ప్రకాష్ గౌడ్లు అటెండ్ అయ్యారు. ఈ ఇష్యూపై బీఆర్ఎస్ మరోసారి గళమెత్తుతోంది. కాంగ్రెస్లో చేరలేదని శాససభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు చేసిన కామెంట్స్ అబద్ధాలు అంటూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.అయితే దీనికి మంత్రి శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. సీఎం తన నియోజకవర్గానికి వచ్చినందుకే..అరికెపూడి గాంధీ వచ్చి కలిశారే తప్ప.. సీఎల్పీ సమావేశానికి హాజరు కాలేదన్నారు. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ సమావేశానికి రాలేదని.. కేవలం సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి వెళ్లారని చెప్పుకొచ్చారు. సిద్ధిపేట నియోజకవర్గానికి సీఎం వెళ్తే.. కార్యక్రమంలో హరీష్రావు పాల్గొనరా అంటూ శ్రీధర్బాబు ఎదురు ప్రశ్నించారు.అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా ఫిరాయింపుల అంశం కుతకుతలాడుతోంది. గాంధీభవన్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాల్లో వివాదం రాజుకుంటోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు.. గాంధీభవన్లో జరిగిన సమీక్షా సమావేశాలకు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశానికి కడియం శ్రీహరి, కరీంనగర్ జిల్లా సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా సమావేశానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అయితే కరీంనగర్ జిల్లా సమావేశం కాస్త రసాభాసా జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్ల జాబితాలో పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు పొందుపరచలేదు. అదే సమయంలో పార్టీ ఫిరాయించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేరును ప్రస్తావించారు. దీంతో జీవన్ రెడ్డి పార్టీ పెద్దల తీరుపై గరం అయ్యారు. జరిగిన తప్పును గ్రహించిన పీసీసీ చీఫ్ మహేష్గౌడ్, ఇంచార్జ్ దీపాదాస్ మున్షి జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. ఏదో పొరపాటు వల్ల పేరు పడలేదని..జరిగిన దానికి సారీ చెప్పి.. మరోసారి ఇలాంటి తప్పిదం జరగదని సర్దిచెప్పారు. శనివారం గాంధీభవన్ జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశానికి జీవన్ రెడ్డి డుమ్మా కొట్టారుఇలా పార్టీ ఫిరాయింపుల అంశం హస్తం పార్టీలో ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. బీఆర్ఎస్ మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత కోసం గట్టి ఆధారాలు సేకరించే పనిలో బిజీగా ఉంది. గాంధీభవన్లో జరిగే సమావేశాలకు..సీఎల్పీ భేటీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరైన ఎవిడెన్స్ను సేకరించి కోర్టుల దృష్టికి తీసుకెళ్లాలని చూస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు టెక్నికల్ అంశాలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. డైలీ ఎపిసోడ్లా కొనసాగుతున్న ఈ ఇష్యూ ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అయితే ఫైనల్గా ఎవరు పైచేయి సాధిస్తారనేది మాత్రం హాట్ టాపిక్గా మారింది.