కొవిడ్‌కి ముందు..కొవిడ్‌కి తరవాత.

సిరా న్యూస్;

కొవిడ్‌కి ముందు..కొవిడ్‌కి తరవాత. ఈ మధ్య ఏదైనా సరే ఇలాగే లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. ప్రతి రంగాన్నీ కుదిపేసింది ఈ సంక్షోభం. ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. అప్పుడు మొదలైన ద్రవ్యోల్బణం ఆగకుండా పరుగులు పెడుతోంది. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా అవేవీ పెద్దగా సక్సెస్ అవడం లేదు. ఇది సామాన్యుడిపై మోయలేని భారం మోపుతోంది. నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. కాస్త పెద్ద నోటు పట్టుకుని మార్కెట్‌కి వెళ్లినా చిల్లర కూడా మిగలకుండానే ఇంటికి వెనుదిరగాల్సి వస్తోంది. సంచి కూడా పూర్తిగా నిండడం లేదు. అలా ఉన్నాయి ధరలు. కూరగాయల సంగతి సరేసరి. కనీసం బియ్యం అయినా అందుబాటు ధరలో ఉన్నాయిలే అనుకుని సరిపెట్టుకునే లోపే నెత్తిన పిడుగు పడింది. ఉన్నట్టుండి పెరిగిపోయాయి బియ్యం ధరలు. బియ్యం కనబడితేనే ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టుగా భయపడిపోతున్నారు సామాన్యులు. 15 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టే స్థాయిలో ధరలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు మార్కెట్‌ నిపుణులు. రైస్‌కి డిమాండ్‌ పెరుగుతోంది. ఆ స్థాయిలో సరఫరా లేకుండా పోయింది. డిపార్ట్‌మెంట్‌కి చెందిన ప్రైజ్ మానిటరింగ్ లెక్కల ప్రకారం చూస్తే…ఏడాది కాలంలోనే బియ్యం ధరలు 15% మేర పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్ 21 నాటికి బియ్యం రిటైల్ ధర కిలోకి రూ.37.99గా ఉంది. ఇదే ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికి ఇది రూ.43.51 కి పెరిగింది. కొన్ని చోట్ల ఇది రూ.50 వరకూ ఉంది. ఈ పెరుగుదల ఎక్కడి వరకూ వెళ్తుందో ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి.కింద ట్రేడర్స్‌కి క్వాలిటీ రైస్‌ కిలో రూ.29కే విక్రయిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్వాలిటీ రైస్‌ నిల్వలు కూడా సరిపడా ఉన్నట్టు తెలిపింది. అయితే…రిటైల్‌ మార్కెట్‌లో మాత్రం కిలో రూ.43 కి పైగా విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలో క్వింటాల్ ధర ఒక్కో చోట రూ.6 వేలకు పైగానే పలుకుతోంది. కర్ణాటకలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అక్కడ ఈ సారి లోటు వర్షపాతం నమోదైంది. ఆశించిన స్థాయిలో పంట చేతికి అందలేదు. అక్కడ కేవలం నెల రోజుల్లోనే బియ్యం ధరల్లో 15-20% మేర పెరుగుదల కనిపించింది. సోనా మసూరి బియ్యం కిలో రూ.60 వరకూ పెరిగింది. తెలంగాణలో క్వింటాల్ ధర రూ.5 వేలకు పైగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ఠంగా క్వింటాల్ ధర రూ.4 వేలకు పైగా పలుకుతోంది. ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కలు. రానున్న రోజుల్లో ఇవి ఎంత వరకూ పెరుగుతాయో స్పష్టత లేదు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకునే భారత్‌ ఈ ఏడాది జులైలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగుమతులపై ఆంక్షలువిధించింది. విదేశాలకు రైస్‌ని పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తోంది భారత్‌. ఆసియాలో అతి పెద్ద ఎక్స్‌పోర్టర్‌ కూడా మనమే. ఈ కారణంగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌తో పాటు పలు ఆసియా దేశాలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. నాన్‌ బాస్మతి వైట్‌ రైస్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించింది భారత్. పారాబాయిల్డ్ నిల్వలు పెంచుకునేందుకు 20% వరకూ ఎగుమతి పన్నులు విధించింది. అంతే కాదు. అక్టోబర్‌లో మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతి రైస్‌ కనీస ఎగుమతి ధర ని రూ.950గా నిర్ణయించింది. వీలైనంత వరకూ ఎగుమతులు తగ్గించేందుకు ఇలా చేయక తప్పలేదని కేంద్రం స్పష్టం చేసింది.FCI వద్ద బియ్యం నిల్వలు సరిపడా ఉన్నాయి. పైగా ఈసారి ఖరీఫ్‌లోనూ ఉత్పిత్తి బాగానే జరిగింది. అయినా మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో ఇక్కడ కేంద్రం వాదన ఒక్కటే. ఎగుమతులపై సరైన ఆంక్షలు విధించకపోవడం వల్లే ఈ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయని చెబుతోంది ప్రభుత్వం. దాదాపు రెండేళ్లుగా దేశంలో బియ్యం ద్రవ్యోల్బణం 12%గా కొనసాగుతోంది. ఇప్పటికిప్పుడు ధరలను నియంత్రిస్తే తప్ప ఈ ద్రవ్యోల్బణం మరింత పెరగకుండా అడ్డుకోడానికి వీలుంటుంది. ఆసియాతో పాటు ఆఫ్రికా దేశాలకూ బియ్యం ఎగుమతి చేస్తోంది భారత్. ఆయా దేశాలతో ఉన్న మైత్రిని కూడా పక్కన పెట్టి బియ్యం ధరలు తగ్గించడానికి సొంత లాభం చూసుకోవాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *