సిరా న్యూస్,హైదరాబాద్;
భారతీయ జనతా పార్టీలో ఏ రాష్ట్రానికి లేనంత మంది ఇంఛార్జ్లు తెలంగాణకు ఉన్నారు. ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులు ఇంఛార్జ్లుగా ఉన్నారు. అయిన తెలంగాణలో ఆ పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. ఎక్కువ మంది ఇంఛార్జ్లు ఉండడం సమన్వయం లేకపోవడంతో పార్టీపై ప్రభావం పడ్డదని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. ఇప్పటికైనా ఎవరో ఒకరినే ఇంఛార్జ్గా పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్లుగా ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యవహారాల సహా ఇంఛార్జ్గా జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ ఉన్నారు. జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ ఎలాగూ ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్గా ప్రకాష్ జవదేకర్ను ఆ పార్టీ నియమించింది. తెలంగాణ రాష్ట్రంపైన ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ హై కమాండ్ ఎక్కువ మంది నీ ఈ రాష్ట్రానికి పంపించింది. ఏ రాష్ట్రానికి లేనంత మందిని ఇక్కడ ఇంఛార్జ్లుగా పెట్టింది. అయితే వారి మధ్య సమన్వయం లేకనో, వారు రాష్ట్ర నేతలను సమన్వయం చేయలేకనో అనుకున్న ఫలితాలు సాధించలేక పోయింది బీజేపీ.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్ ఎన్నికలకు ఆ పార్టీ సమాయత్తం అవుతుంది. సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ లు రాష్ట్రానికి వస్తున్నారు. సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా వాళ్ళే ఉంటారా.. పార్లమెంట్ ఎన్నికల వరకు వారే కొనసాగుతారా అనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జాతీయ కమిటీలో మార్పులు చేర్పులు చేశారు. కొద్ది మందిని తప్పించి కొత్త వారిని తీసుకున్నారు.
అయితే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్లుగా ఉన్నవారు జాతీయ కమిటీలో అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. జేపీ నడ్డా కొత్తగా తీసుకున్న వారికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ఎక్కడ అయితే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్లు లేరో అక్కడ కొత్త వారిని నియమిస్తారా.. లేక పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేస్తారా అనే చర్చ జరుగుతుంది. అయితే రాష్ట్రానికి మాత్రం ఎవరినో ఒకరిని మాత్రమే పెడితే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తెలంగాణ పెద్ద రాష్ట్రం ఏమీ కాదని అంత మంది అవసరం లేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అసలు పని జరగదని, బాధ్యతగా పని చేయరని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది కనిపించిందని పార్టీ నేతలు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీ ఎన్నికల ఇంఛార్జ్ని నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.