సిరా న్యూస్,గుంటూరు;
గుంటూరులో మంత్రి విడదల రజిని కార్యాలయంపై అర్దరాత్రి దాడి జరిగింది. గత అర్దరాత్రి న్యూ ఇయర్ వేడుకల వేళ మంత్రి విడదల రజిని కార్యాలయంపై కొందరు రాళ్ల దాడి చేశారు. దీంతో రజిని కార్యాలయం అద్దాలు ధ్వంసం కాగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.విడదల రజిని ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే గుంటూరులోని విద్యానగర్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మంత్రి విడదల రజని కార్యాలయం జనవరి 1వ తేదీన ప్రారంభించాల్సి ఉందని చెబుతున్నారు. అయితే గత రాత్రి టీడీపీ, జనసేన కార్యకర్తలు రాత్రి మంత్రి రజిని కార్యాలయం సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా కొందరు మంత్రి రజిని కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జి చేసి అందరిని చెదరగొట్టారు. కొందరు టీడీపీ, జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.