– ప్రజా పాలనలో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలి
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
సిరాన్యూస్,జాక్రాంతి,
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి మున్సిపాలిటీ లోని 19వ వార్డు అంబేడ్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజాపాల న కార్యక్రమానికి వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసే నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులందరినీ ఎంపిక చేసి గ్యారెంటీ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ గ్యారంటీలతో పాటు ఇతర సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నా మని, ఇతర దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యలు అన్నిటినీ పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చే దరఖాస్తులను ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీ కార్యక్రమం ద్వారా దరఖాస్తులను సమర్పించడా నికి వచ్చే ప్రజలకు దరఖాస్తు నమోదులో అవగాహన కల్పించడంతో పాటు సహకారాన్ని అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం వార్డు సభ మొదలైనప్పటి నుండి జనవరి 6 వరకు ఉంటుందని, వార్డు సభల్లో తమ దరఖాస్తులను అందజేయని వారు జనవరి 6 వరకు అందజేయాలని ఆయన తెలిపారు. ప్రజాపాలన కేంద్రాలకు వచ్చి సమర్పించే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని, దరఖాస్తులను తిరస్కరించడానికి వీలు లేదని ఆయన పేర్కోన్నారు. కేంద్రానికి వచ్చిన మహిళలతో దరఖాస్తుల పంపిణీ, నమోదు, వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లిలోనీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించి కార్పొరేట్ కు ధీటుగా విద్యను అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి తమ పిల్లలని పంపాలని కలెక్టర్ మహిళలను కోరారు. మన పిల్లల అభివృద్ధి కోసం మనం బాధ్యత తీసుకోవాలని, వారి చదువుపై శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు కొంత సమయం పిల్లలు చదువుకునేలా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు దరఖాస్తులు సమర్పించిన తరువాత వారికి ఏ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో తెలియజేస్తూ అందిస్తున్న రశీదును కలెక్టర్ పరిశీలించి, సదరు రశీదును జాగ్రత్తగా భద్ర పర్చుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి, మునిసిపల్ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, అంగన్వాడి ఆశా కార్యకర్తలు, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.