సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఇచ్చోడ కస్తూర్బాలో కష్టాలు తీరేదెన్నడు?
+ ప్రహారి లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థినిలు
+ పక్కనే శ్మశానం, కల్లు కంపౌండ్…
+ రాత్రి వేళ బిక్కుబిక్కుమంటు కాలం వెళ్లదీస్తున్న వైనం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినిలకు ఏళ్లుగా అవస్థలు తప్పడం లేదు. 6వ తరగతి నుండి ఇంటర్ మీడియేట్ వరకు ఉన్న ఈ పాఠశాలలో అన్ని వసతులున్నప్పటికీ ప్రహారీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కొత్తగా నిర్మించిన కాలేజ్ బ్లాక్ సైతం అందుబాటులోకి రావడంతో తరగతి గదులు, డార్మెట్రీ కోసం విద్యార్థినిలకు పెద్దగా ఇబ్బందులు లేవనే చెప్పవచ్చు. మొత్తం 310 మంది విద్యార్థినిలు ఉన్న ఈ పాఠశాలలో ప్రహారీ సమస్యతో అంతా సతమతమౌతున్నారు.
ఊరికి దూరంగా… రహాదారికి దెగ్గరగా…
ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా విద్యాలయం ఊరికి దూరంగా ఉండటంతో ఇక్కడ ప్రహారీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని చెప్పవచ్చు. దీనికి తోడు రహాదారి సైతం కూత వేటు దూరంలోనే ఉండటంతో ప్రహారీ అనేది అనివార్యంగా మారిందని విద్యార్థినిల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏండ్లుగా ప్రహారీ లేకపోయినప్పటికీ కూడ పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
రాత్రి వేళ బిక్కుబిక్కుమంటూ…
దినంలో విద్యార్థుల పాఠాలు, వచ్చిపోయే వహానాల చప్పుడు, చుట్టూ జనాల సందడితో ఎలాగోలా గడుస్తున్నప్పటికీ రాత్రి వేళ మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థినిలు, ఉపాద్యాయినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే శ్మాశానం, కల్లు కంపౌండ్ ఉండటంతో విద్యార్థినిలు భయపడుతున్నారు. హాస్టల్ వసతి ఉండటంతో రాత్రి వేళ విద్యార్థినిలు ఇక్కడే ఉండటం జరుగుతుంది. విద్యార్థినిలతో పాటు ఇక్కడే ఉంటూ విధులు నిర్వర్తించే ఉపాద్యాయినిలు సైతం రాత్రి పూట బిక్కిబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్థిక, సామాజిక, ఇతరాత్ర కారణాల వలన డ్రాపౌట్స్గా మారిన విద్యార్థినిలకు నాణ్యమైన వసతి, భోజనం, విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం నెలకొల్పిన ఈ కస్తూర్బా విద్యాలయానికి ప్రహారీ నిర్మించి, రక్షణ కల్పించాలని స్థానికులు, పోషకులు వేడుకుంటున్నారు.