సిరా న్యూస్,హైదరాబాద్;
బస్టాండ్ బిజీబిజీగా మారింది.. రైల్వే స్టేషన్ ఇరుకైపోయింది. హైవేలు మరీ చిన్నగా తయారయ్యాయి. ఓట్ల పండుగ.. సంక్రాంతి పండుగ రికార్డును బ్రేక్ చేసేసింది. ఓటు వేసేందుకు భాగ్యనగరం బయల్దేరి వెళ్లింది. ఓట్ల జాతరతో పాటు వరుస సెలవులు కావడంతో… నగరవాసులు స్వస్థలాలకు క్యూకట్టారు. దీంతో భాగ్యనగరం బోసి పోయింది.ఎన్నికల పుణ్యమాని హైదరాబాద్ సిటీ అంతా ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది.రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నో ట్రాఫిక్.. నో సిగ్నల్స్.. నో పొల్యూషన్తో భాగ్యనగరం, నయా నగరంగా కనిపిస్తోంది. కేవలం సంక్రాంతి పండుగ టైమ్లోనే సిటీలో కనిపించే ఇలాంటి దృశ్యాలు.. ఇప్పుడు ఓట్ల పండుగకు కనిపిస్తున్నాయి. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం నగరవాసులు పల్లెబాట పట్టారు. తమకు నచ్చిన నాయకుడిని గెలిపించేందుకు సొంతూళ్లకు పయనమయ్యారు.ఎన్నికల వేళ ప్రయాణికుల తాకిడితో టీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండుగ రికార్డ్ను బ్రేక్ చేసింది. సంక్రాంతి కన్నా 10 శాతం పైగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నట్లు టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో 1.42 లక్షల మంది ప్రయాణించగా.. ఇందులో ఏపీకి 59,800 మంది జర్నీ చేసినట్లు పేర్కొన్నారు. రేపే పోలింగ్ కావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగి అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్లలో ఉండే సెటిలర్లు పెద్ద ఎత్తున ఏపీకి వెళ్లినట్లు టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది.