సిరా న్యూస్,ముంబై;
తమదైన ప్రోడక్ట్ పేటెంట్ హక్కు కోసం వచ్చే అప్లికేషన్స్ సంఖ్య బాగా పెరిగినట్లు పేటెంట్, డిజైన్ – ట్రేడ్మార్క్ విభాగం తెలిపింది. 2023-24లో లక్షకు పైగా పేటెంట్లను జారీచేసినట్టు అధికారులు వెల్లడించారు. సకాలంలో పేటెంట్ అప్లికేషన్స్ క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో, పేటెంట్, డిజైన్ – ట్రేడ్మార్క్ విభాగం లక్షకు పైగా పేటెంట్లను జారీ చేసింది. ఈ సమాచారాన్ని కంట్రోలర్ జనరల్ ఉన్నత్ పండిట్ తెలిపారు. గతేడాది 1.03 లక్షల పేటెంట్లు జారీ చేశామన్నారు. పేటెంట్ అప్లికేషన్స్ సకాలంలో పరిష్కరిస్తున్నామనీ, దీని విషయంలో ఆలస్యం ఉండదనీ అయన తెలిపారు. అలాగే పేటెంట్ కోరిన 30 నెలల్లోనే 40 శాతం దరఖాస్తులను పరిష్కరించినట్లు వెల్లడించారు. పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్అన్నిటినీ పరిష్కరించినట్లు కంట్రోలర్ జనరల్ చెబుతున్నారు. ఇప్పుడు విచారణ కోసం వచ్చిన ఏదైనా అప్లికేషన్ 30-36 నెలల్లో క్లియర్ అవుతుంది. అందువల్ల తదుపరి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం ఉండదు.ప్రతి సంవత్సరం పేటెంట్ల కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2023-24లో, డిపార్ట్మెంట్ 90,300 పేటెంట్ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. వీటిలో సైన్స్ – టెక్నాలజీ రంగాలు మాత్రమే కాకుండా, భద్రతపై కూడా గణనీయమైన ప్రాధాన్యత ఉంది. పేటెంట్ల కోసం దరఖాస్తు చేస్తున్న వారిలో అత్యధిక సంఖ్యలో పరిశోధనలకు సంబంధించినవారే.దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు ఒక టెక్నాలజీ సంబంధిత సంస్థ లేదా వ్యక్తి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటారని వాణిజ్యం – పరిశ్రమల మంత్రిత్వ శాఖ గతంలో తెలియజేసింది. 2023లో, ఆల్ టైమ్ అత్యధికంగా 90,300 పేటెంట్ దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్ కార్యాలయం గత ఒక సంవత్సరంలో (మార్చి 15, 2023 నుండి మార్చి 14, 2024 వరకు) లక్షకు పైగా పేటెంట్లను జారీ చేసింది.పేటెంట్ అనేది ఒక నిర్దిష్ట ఉత్పత్తి, ఆవిష్కరణ, రూపకల్పన, ప్రక్రియ లేదా సేవ కోసం ఒక వ్యక్తి లేదా సంస్థకు ఇచ్చే చట్టపరమైన హక్కు. ఇది ఒక రకమైన అధికారాన్ని ఇస్తుంది. దానిని పొందిన తర్వాత, పేటెంట్ హోల్డర్ అనుమతి లేకుండా ఏదైనా ఇతర వ్యక్తి లేదా సంస్థ దానిని ఉపయోగిస్తే, అది చట్టపరమైన నేరంగా పరిగణిస్తారు.