స్వర్ణముఖి నదికి హారతులు

సిరా న్యూస్,శ్రీకాళహస్తి;
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో కార్తీక మాసం సందర్భంగా స్వర్ణముఖి నదికి హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లాల్లో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరిధిలోని స్వర్ణముఖి.. దక్షిణ భారతంలో ప్రవహించే ప్రముఖ నదుల్లో ఒకటి. తిరుపతి- చంద్రగిరి మధ్యన గల తొండవాడ సమీపంలోని కొండ ప్రాంతం.. ఈ నది జన్మస్థానం. అక్టోబర్ నుంచి డిసెంబర్ సమయంలో ప్రవహించే స్వర్ణముఖిని హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని నిర్మించే కూలీలు ఈ నదిలో దిగి.. శుభ్రం చేసుకునే సమయంలో.. ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే.. వారి కష్టానికి ఫలితంగా ఇసుక బంగారంగా మారేదని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ నదికి స్వర్ణముఖి అనే పేరొచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు. అలాంటి విశిష్ఠత కలిగిన ఈ నదికి కార్తీకమాసంలో హారతి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే శ్రీకాళహాస్తీశ్వర ఆలయంలోని ఉత్సవమూర్తులను.. నంది.. సింహా వాహనాలపై ఊరేగింపుగా నది వద్దకు తీసుకువచ్చారు. అనంతరం దేవతామూర్తులకు గణపతి పూజ, వరుణ పూజ, కలశ పుష్ప పూజలు చేసి పుణ్యవచనము ఆచరించి.. వేద మంత్రాల నడుమ పండితులు స్వర్ణముఖికి హారతులు సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *