విజయసాయిరెడ్డిపై చర్యలా….

సిరా న్యూస్,నెల్లూరు;
వైసీపీ ఎమ్మెల్సీ, టెక్కలి నేత దువ్వాడ శ్రీనివాస్‌పై వేటు వేసింది వైసీపీ అధిష్టానం. దీనికి ఫ్యామిలీ వ్యవహారాలే కారణమని, అందువల్లే ఆయనను పక్కన పెట్టాల్సివచ్చిందని ఫ్యాన్ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఇలాంటి చిక్కు సమస్యను వైసీపీ ద్వితీయ నేత విజయసాయిరెడ్డి ఎదుర్కొంటున్నారు.వీఎస్ఆర్ వ్యవహారంపై దాదాపు వారంరోజుల పాటు వార్తలు నానాహంగామా చేశాయి. అయితే వీఎస్ఆర్ విషయంలో జగన్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ఆ పార్టీ నేతలు ఆరా తీయడం మొదలు పెట్టారు. కొన్ని విషయాలు అంతర్గతంగా చర్చించుకోవడం మొదలైంది.దేవాదాయశాఖలో పని చేస్తున్న అసిస్టెంట్ కమిషన్ వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి గురించి వేగుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారట జగన్. ఈ వ్యవహారం పై పార్టీకి ఇంటా బయటా అనేక తలనొప్పులు తెచ్చాయి. కాసింత పార్టీ డ్యామేజ్ కూడా అయ్యింది.ఒకానొక దశలో వీఎస్ఆర్‌ను పార్టీకి దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నారట. కాకపోతే అక్రమాస్తుల కేసులో ఆయన అప్రూవర్‌గా మారితే లేని పోని సమస్యలు వస్తాయని భావించి సైలెంట్ అయ్యారంటూ ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.వారం కిందట వైసీపీ కీలక నేతలను బెంగుళూరుకు రప్పించుకుని మాట్లాడట జగన్. కాకపోతే వీఆర్ఎస్‌కు ఎలాంటి కబురు లేదని, ఈ క్రమంలో ఆయనను దూరంగా పెట్టారనే చర్చ కూడా మొదలైపోయింది. ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకుని గిలగిల కొట్టుకున్న ఎమ్మెల్సీ దువ్వాడపై వేటు వేసింది ఆ పార్టీ. ఒక విధంగా నేతలకు ఇది వార్నింగ్ లాంటిదేనని అంటున్నారు.కొద్దిరోజులుగా వీఎస్‌ఆర్ ఎక్కడా కనిపించలేదు. కనీసం మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. కేవలం ఎక్స్ ద్వారా నాలుగు రాళ్లు విసురుతున్నారే తప్ప, జాడ కనిపించలేదని అంటున్నారు నేతలు. మొత్తానికి పెద్ద తలకాయలను హైకమాండ్ పక్కన పెట్టిందని మాట్లాడుకోవడం గమనార్హం.మరోవైపు జగన్ వ్యవహారశైలిపై దువ్వాడ అనుచరులు రుసరుసలాడుతున్నారు. దువ్వాడ ఎలాంటి తప్పు చేయలేదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పెద్దాయన మాటేంటి? అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. వైసీపీలో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *