సిరాన్యూస్, ఆదిలాబాద్
బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే : డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై అవిశ్వాస తీర్మానం విషయంలో బీఆర్ఎస్ , బీజేపీ రెండు పార్టీలు ములాఖత్ అయ్యాయని కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.తమ నాయకుడు అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆరోపించినట్టు మాజీ మంత్రి జోగు రామన్న, ప్రస్తుతం ఎమ్మెల్యే గా ఉన్న పాయల శంకర్ ఇద్దరూ ఒక్కటేనన్న మాట ఇప్పుడు రుజువైందన్నారు. ఇదంతా ప్రజలు గమనించాల్సిన అవసరముందన్నారు. మున్సిపల్ రాజకీయంలో ఇద్దరు ప్రధాన భూమిక వహిస్తున్నారని అన్నారు.గతంలో కూడా ఇదే విధంగా ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న తన కుమారుడికి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టడంలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న పాయల్ శంకర్ సహకరించాడని ఆరోపించారు. ఇద్దరిలో ఎవరు అధికారంలో ఉంటే మరొకరికి తోడ్పాటు నందిస్తారని, ఈ విషయం గత ముఫ్పై ఏళ్లుగా ఆదిలాబాద్ లో జగమెరిగిన సత్యమే అన్నారు. పైకి వేర్వేరు పార్టీలో ఉన్న లోలోన మాత్రం ఇద్దరు ఒక్కటే అన్నారు. ఏ వ్యవహారమైనా ఇద్దరు కలిసే చేస్తారని భూములు ,రియల్ దందాల్లో ఇద్దరి భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లోను ఇది స్పష్టమైందన్నారు. ప్రస్తుతం మున్సిపల్లో వైస్ చైర్మన్ ను గద్దెదించే ప్రక్రియలో ఇద్దరు కలిసి పని చేస్తున్నారన్న తన వ్యాఖ్యలు అబద్దమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఖండించగలుగుతాడా అని ప్రశ్నించారు. నిజంగా అవిశ్వాసానికి మద్దతివ్వదలచుకోలేక పోతే తీర్మాన సమయంలో తమ కౌన్సిలర్లు హజరు కాకుండా చూసుకోవాలన్నారు. అప్పుడు మీరు ఒకటి కాదని వేరే అని విశ్వసిస్తామన్నారు. లేదంటే ఇద్దరూ ఒక్కటేనన్న తమ వాదనను ఆదిలాబాద్ ప్రజలు గమనిస్తారని అన్నారు. మరి రేపు వారిద్దరు తాము ఒకటి కాదు అని నిరూపించుకోవలసిన అవసర ముందన్నారు. ఇద్దరూ ఒక్కటేనన్న తన ప్రశ్నకు వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ఒక వేళ అవిశ్వాస సమయంలో రెండు పార్టీలకు చెందిన మున్సిపల్ సభ్యులు హాజరైతే మీరిద్దరు ఒక్కటేనని నిరూపితమవుతుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆశమ్మ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ముగెల నర్సింగ్ , కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, బండారి సతీష్ , లక్ష్మన్ ,జాఫర్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ , లోక ప్రవీణ్ రెడ్డి , పోరెడ్డి కిషన్ ,షకీల్,ఖయ్యూం,శివప్రసాద్ రెడ్డి ,తమ్మల చందు, ఎల్మ రామ్ రెడ్డి ,సురేందర్ రెడ్డి, యాల్లా పోతా రెడ్డి, సుకేందర్,భూమయ్య తదితరులు పాల్గొన్నారు.