సిరా న్యూస్, కోనరావుపేట
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
* లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేత
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో 127 మంది లబ్ధిదారులకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కోనరావుపేట మండలాన్ని రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకుందాం అన్నారు. నిరుపేద ప్రజలకు చేయూతనివ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని, నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే వాటిని తప్పకుండా కొనసాగిస్తామని అందుకు ఉదాహరణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని, ప్రజలకు మెరుగైన ప్రజా పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. తను మండల ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడే కోనరావుపేట, మండలాలలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు 2005 వారు సంవత్సరంలోనే శ్రీకారం చుట్టానని అన్నారు. అగ్రహారం డిగ్రీ కళాశాలలో సైన్స్ వింగ్ ను అప్పట్లోనే ఏర్పాటు చేశామన్నారు. కొనరావుపేట మండలానికి కావలసిన బ్రిడ్జిల నిర్మాణం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తుందని మండలాన్ని రాజకీయాలకతీతంగా అభివృద్ధిని పరిగెత్తించే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు.