పాపం… కలిసి రాని కాలం

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలోని…ఆ ముగ్గురు నేతలకు పదవులు అందని ద్రాక్షగా మారాయనే టాక్ వినిపిస్తోంది.తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్‌ కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. దశలవారీగా ఉద్యమాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచారు. రాష్ట్ర సాధనలో కీ రోల్ పోషించారు. ఉద్యమ సమయమంతా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా కేసీఆర్‌ వెంటే నడిచారు. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక.. కోదండరాంకు ఎలాంటి పదవులు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కోదండరాంను రాజ్యసభకు పంపిస్తారని లేందంటే ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇస్తారని ఇలా రకరకాల ప్రచారం జరిగింది. కానీ అవేవీ జరగలేదు. పైగా కేసీఆర్‌కు కోదండరాం మధ్య గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత తెలంగాణ జన సమితి పేరుతో పార్టీ పెట్టారు. రీసెంట్‌గా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేసింది.కోదండరాంను ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఇక ప్రమాణమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ అంతలోనే హైకోర్ట్‌ ట్విస్ట్ ఇచ్చింది. ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్‌ఎస్ నేత శ్రవణ్‌ హైకోర్టులో సవాల్ చేశారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై విచారణ తేలే వరకు ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో పదవి ఇలా వచ్చినట్టే వచ్చి అలా అగిపోయింది. వ్యక్తిగత హోదాలో ప్రజల కోసం పోరాడిన కోదండరాంను.. పదవి ఇప్పటికీ ఊరిస్తూనే ఉంది.కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కి దురదృష్టం నీడలా వెంటాడుతూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటు అద్దంకి దయాకర్ ఆశించారు. అక్కడ శామ్యూల్‌కి అధిష్టానం టికెట్ కేటాయించింది. ఆ సమయంలో ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు ఇస్తామని దయాకర్‌కి హామీనిచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ కు ఛాన్స్ ఇస్తారని అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం మరొకరికి ఛాన్స్ ఇచ్చింది. పదవి వచ్చినట్టే వచ్చి చేజారడంతో బాగానే డిసప్పాయింట్ అయ్యారు అద్దంకి. కాకపోతే తన కోసం పార్టీ మంచి పదవి ఇస్తుందేమోనని ఆశలు మాత్రం వదలుకోలేదాయన.దాసోజు శ్రవణ్‌.. నల్గొండ జిల్లాకు చెందిన నేత. తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. పార్టీ, పదవి ఏదైనా, దానికి వన్నె తెచ్చే నేత. వక్తగా, సబ్జెక్ట్‌పై గ్రిప్ ఉన్న మేధావిగా పేరుంది. మంచి వాక్చాతుర్యం, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం, మీడియా డిబేట్‌లో పార్టీ గళం వినిపించేవారిలో దాసోజు ముందు వరుసలో ఉంటారు.ప్రజా రాజ్యం, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలో పని చేసిన శ్రవణ్‌.. తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరికతో ఎమ్మెల్సీ అవకాశం అందిపుచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, బీఆర్‌ఎస్‌ తరపున అపెక్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో ఫుల్ ఖుషీ అయ్యారాయన. అయితే గవర్నర్ కోటా కింద ప్రతిపాదించిన శ్రవణ్‌ను తమిళి సై తిరస్కరించారు. సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సమాజ సేవ రంగాల్లో అనుభవం లేదని శ్రవణ్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి నోచుకోకుండాపోయారు శ్రవణ్.కష్టానికి తగ్గ ఫలితం ఏదో రూపంలో వస్తుంది. కాకపోతే దానికి అదృష్టం కూడా తోడవ్వాలని అంటారు. మరి ఆ.. లక్‌ ఈ నేతలకు ఎప్పుడు తగులుతుందో చూడాలి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *