సిరా న్యూస్;
-నేడు ఆయన జయంతి,వర్ధంతి
అలిశెట్టి ప్రభాకర్ ఒక అభ్యుదయ విప్లవ రచయిత మాత్రమే కాదు అస్తమించని అక్షర సూర్యుడు. సామాజిక కోణంలో అనేక కార్టూన్లు వేసిన జర్నలిస్టు కూడా.అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1956 జనవరి 12 న జన్మించారు. అలిశెట్టికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. తండ్రి పరిశ్రమల శాఖలో పనిచేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. ఆయన మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించాడు. ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలయిన ‘భాగ్యం’ ను పెళ్ళి చేసుకొన్నారు. జీవిక కోసమే తప్పా, ఏనాడు సంపాదన కొరకు ఆరాటపడని మనిషి. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే, కవిగా ఎదిగాడు. 1982 లో హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవిత్వం రాశాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకడు. క్షయ బారిన పడి 1993 జనవరి 12న మరణించారు.
చిత్రకారుడిగా : ఆయన మొదట చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు… ఫోటో గ్రాఫర్గా : సిరిసిల్లలో రాం ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ నేర్చుకొని, 1975 లో జగిత్యాలలోని సొంత ఇంట్లో పూర్ణిమ స్టూడియో ప్రారంభించాడు. కరీంనగర్లో స్టూడియో శిల్పి (1979), హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ (1983) పేర్లతోనూ స్టూడియోలు నడిపి ఫోటో గ్రాఫర్గా జీవితాన్ని గడిపాడు…
కవిగా: జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలో ప్రవేశించాడు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చైన ఆయన మొదటి కవిత. ఎర్ర పావురాలు (1978) అచ్చైన ఆయన మొదటి కవితా సంకలనం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతిపొందాడు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వం రాశాడు…అచ్చైన కవితా సంకలనాలు: ఎర్ర పావురాలు (1978), మంటల జెండాలు (1979), చురకలు (1981), రక్త రేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభ గీతం (1990),సిటీ లైఫ్ (1992)