అందరి చూపు…. ఆ నియోజకవర్గాల వైపే…

సిరా న్యూస్,విజయవాడ;
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించి సార్వత్రిక సమరానికి కాలు దువ్వగా…అంతే దీటుగా అధికారపార్టీ వైసీపీ ఒకేసారి మొత్తం అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి సిద్ధమంది. ఒకటి, రెండు మినహా ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది. వారి బలబలాలు ఏంటో తెలిసిపోయాయి. అయినా కానీ ఎన్నికలు వచ్చాయంటే మాత్రం…తమ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారా అన్న దానికన్నా…ఫలానా సీటు ఎవరు గెలిచారు. ఎవరిపై ఎవరు పై చేయి సాధించారన్న ఆసక్తి కొన్ని నియోజకవర్గాలపై ఉంటుంది.గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పోరు రాయలసీమ ఎన్నికలను తలపించాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు….అరెస్ట్‌లు, ఆందోళనలతో ఉత్తరాంధ్ర ఉడికెత్తిపోయింది. ఇప్పుడు మరోసారి అదే అభ్యర్థులు ప్రత్యర్థులుగా తలపడుతుండటంతో మరింత ఆసక్తి రేకెత్తుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల పోరు అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది టెక్కలి నియోజకవర్గమే. ఎందుకంటే ఇక్కడి నుంచి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తుండగా… ఆయనపై మరోసారి దువ్వాడ శ్రీనివాస్ పోటీపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వీరిరువురి మధ్య జరిగిన సవాళ్లు, ప్రతిసవాళ్లు ప్రజల కళ్లముందే కదలాడుతోంది. ఇప్పుడు మరోసారి వీరువురి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీపడుతుండటంతో తీవ్ర ఆసక్తి కలుగుతోంది. మరో నియోజకవర్గంపైనా అందరి దృష్టిపడింది.ఆమదాలవలసలో మరోసారి బావబావమరిది పోటీపడుతున్నారు. సభాపతి తమ్మినేని సీతారాంపై ఆయన మేనల్లుడు, బావమరిది అయిన కూన రవికుమార్‌ పోటీ చేస్తున్నారు. తమ్మినేని వారసుడిగానే రాజకీయ అరంగ్రేటం చేసిన కూన రవికుమార్ ఏకంగా ఆయనపైనే పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో బావ చేతిలో ఓటమి చవిచూశారు. వీరిరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు ఉండటంతో వీరిద్దరి మధ్య పోటీ సైతం ఆసక్తి కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలో మరోసారి బొత్స కుటుంబానికి సీట్లు దక్కగా…వారిపై పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్నది ఆసక్తి కలుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణపై దీటైన అభ్యర్థి కోసం తెలుగుదేశం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆయనకు సరైన ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావేనని భావించి చంద్రబాబు…ఇప్పటికే రెండుసార్లు ఆయనకు సూచించారు. చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందిగా కోరినా…గంటా శ్రీనివాసరావు విముఖత చూపినా….ఆయన్నే బరిలో దింపనున్నారని తెలిసింది. ఇదే జరిగితే ఉత్తరాంధ్రలో సమఉజ్జీల సమరం చూడొచ్చు.విశాఖ జిల్లా గాజువాకలోనూ చివరి నిమిషంలో సీటు దక్కించుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీని ఆసక్తిగా మలిచారు. అటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు పోటీలో ఉండగా…ఇటు మంత్రి అమర్నాథ్‌ రంగంలోకి దిగడంతో పోరు ఆసక్తిగా మారింది. అలాగే వరుసగా గెలుపులతో ఊపుమీద ఉన్న విశాఖ తూర్పులో రామకృష్ణబాబుపై వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దింపింది. భీమిలిలోనూ మాజీమంత్రి ముత్తంశెట్టి సత్యనారాయణ వైసీపీ నుంచి మరోసారి బరిలో నిలవగా…తెలుగుదేశం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇదే సీటు కోసం గంటా శ్రీనివాసరావు తీవ్రంగా పట్టుబడుతున్నారు. ఒకవేళ ఈ సీటు గంటాకు దక్కితే..ఒకప్పటి స్నేహితుల మధ్య పోరు చూడొచ్చు. పాయకరావుపేటలో తెలుగుదేశం ఫైర్‌బ్రాండ్, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత బరిలో నిలవగా….వైసీపీ కంబాల జోగులకు టిక్కెట్ కేటాయించింది. అలాగే నర్సీపట్నంలోనూ పాత ప్రత్యర్థులు మరోసారి పోటీపడుతున్నారు. మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై శంకర గణేశ్‌ మళ్లీ తలపడనున్నారు .రాష్ట్రంలో ఎవరు గద్దెనెక్కాలి..ఎవరు దిగిపోవాలని డిసైడ్‌ చేసే కీ ఓట్లు, సీట్లు ఉన్న గోదావరి జిల్లాల్లోనూ ఈసారి గాలి ఎటు తిరుగుంతో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. అత్యంత కీలక నేతలంతా ఈ రెండు జిల్లాల్లోనూ ఉండటం విశేషం. జగ్గంపేటలో తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లిన తోట నరసింహం మరోసారి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగగా….జగన్‌ వెన్నంటే ఉండి అన్నీ తానై పనిచేసిన జ్యోతులనెహ్రూ తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఈసారి పోటీపడుతున్నారు. తునిలో మంత్రి దాడిశెట్టి రాజాపై అనూహ్యంగా టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను పోటీలో నిలబెట్టారు. ఇక్కడా పోటీ ఆసక్తికరంగా మారింది.రాష్టవ్యాప్తంగా అందరి చూపు ఒకే ఒక్క నియోజకవర్గంపై ఉంది అంటే అది పిఠాపురమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈసారి పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై కాకినాడ ఎంపీ వంగా గీతను వైసీపీ నిలబెట్టింది. రాజమండ్రి బరిలో ఎంపీ మార్గాని భరత్‌ దిగుతుండగా… సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు ఆయన్ను ఢీకొట్టనున్నారు. రాజమండ్రి రూరల్‌లో సైతం పోటీ ఆసక్తికరంగా ఉంది. టీడీపీ ఫైర్‌బ్రాండ్..రాజకీయ కురువృద్ధుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై ఈసారి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కృష్ణను వైసీపీ ప్రయోగించింది. అలాగే దెందులూరులో చివరి నిమిషంలో రేసులోకి వచ్చిన చింతమనేని ప్రభాకర్‌, అబ్బయ్య చౌదరిని మరోసారి ఢీకొట్టబోతున్నారు. ఇక పాలకొల్లు, భీమవరం, నరసాపురంలోనూ పోటాపోటీగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలుగా పేరుగాంచిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈసారి పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో రెండే రెండు నియోజకవర్గాలపై అందిరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూసే రెండు నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఉన్నాయి అవే ఒకటి గుడివాడ, రెండోది గన్నవరం. తెలుగుదేశంలో గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీకి మరోసారి గన్నవరం టిక్కెట్ కేటాయించగా…గతంలో ఆయనపై ఓటమి చెందిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *