సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును అనే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా.? సర్పంచ్ల ప్లేస్లో ఎవరిని నియమిస్తారు. సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్ను ఎవరికి ఇస్తారు.? గ్రామాల్లో పాలనను ఎవరు కొనసాగిస్తారు అనేక అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం, పంచాయతీ రాజ్ అధికారులపై ఉన్నది. అయితే వచ్చే నెల 1వ తేదీతో ఇప్పుడు ఉన్న సర్పంచ్ల పదవికాలం ముగుస్తుంది. మరి మరికొన్ని రోజులు సర్పంచ్ల పదవికాలాన్ని కొనసాగిస్తారా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా.!!వచ్చే నెల 1వ తేదితో సర్పంచ్ల పదవి కాలం ముగుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహణ కష్టం అని భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఎన్నికల నిర్వహణకు కనీసం 3 నెలల సమయం కావాలి అంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. కానీ అంత సమయం లేకపోవడంతో ఈ సర్పంచ్ల పదవి కాలాన్ని పొడిగిస్తారా లేక ప్రత్యేక అధికారి పాలన పెడతారా అనేది స్పష్టం చేయడం లేదు ప్రభుత్వం. గ్రామాల్లో ఉన్న సమస్యలు, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తాం అని చెప్పిన 6 గ్యారెంటీలు ఎలా.? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయితీ సర్పంచ్లు. మరోవైపు గ్రామసభలు పెడితే 6 గ్యారెంటీలతో పాటు, ఇతర హామీలపై ప్రభుత్వాన్ని, అధికారులను ఎక్కడ నిలదీస్తారో అని ఎన్నికలను వాయిదా వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు గ్రామ సర్పంచ్లు.సర్పంచ్ల పదవికాలం ముగియడంతో గ్రామ పంచాయితీ చెక్ పవర్ ఎవరికి ఇస్తారో అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఆయితే ఎంపిడిఓతో పాటు గ్రామ కార్యదర్శికి ఇస్తారా.. లేక ఎమ్మార్వో, పంచాయతీ రాజ్ ఇంజనీర్లకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారా.. అదీకాక 4 గ్రామాలకు ఒక్క మండల స్థాయి అధికారిని ఇంచార్జిగా నియమించి వారికే చెక్ పవర్ ఇస్తారా.? అనే అంశం ఇంకా తేలాల్సి ఉంది. అయితే గతంలో 4,5 గ్రామాలకు ఒక్క మండల స్థాయి అధికారిని నియమించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చారు. ఈసారి కూడా గతం మాదిరిగానే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.