బడ్జెట్ పై ఏపీ ఆశలు

 సిరా న్యూస్,విజయవాడ;
మరో 3 రోజులు మాత్రమే గడువు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అసలు సిసలు పరీక్ష. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు కేంద్రంలో బీజేపీకి వచ్చిన మెజారిటీ సంఖ్యను చూసి చాలా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం. అయితే చంద్రబాబు మద్దతు అవసరం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉంది. దీంతో ఆయన అనుకున్నది అనుకున్నట్లు వర్క్ అవుట్ అవుతుందని అంచనా వేసుకుంటూ కొంత ముందుకు వెళుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా, అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి కావాలన్నా అప్పులు చేసి చేయడం కుదరదు.. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం అవుతుంది. అది ఏ స్థాయిలో అంటే వేల కోట్ల రూపాయలు రెండు ప్రధాన ప్రాజెక్టులకు అవసరమవుతాయి. అప్పుడే అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తవుతాయి. భవనాలను నిర్మించాలన్నా, ప్రాజెక్టు పూర్తి చేయాలంటే నిర్వాసితులకు పరిహారం దగ్గర నుంచి అనేక సమస్యలు చంద్రబాబు గడప ముందే వెయిట్ చేస్తున్నాయి. వీటన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్లాలంటే మోదీ ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో రాష్ట్రానికి నిధులు చేరాల్సిన అవసరం ఉంది. అందుకే చంద్రబాబు రెండోసారి ఢిల్లీ వెళ్లి కేవలం కీలకనేత అయిన అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించి వచ్చారు. ఈ నెల 23వ తేదీన కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పై చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గడచిన పదేళ్లలో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా మోదీ ప్రభుత్వం కేటాయింపులు జరిపింది దాదాపు శూన్యమనే చెప్పాలి. జగన్ తన ఐదేళ్లలో నిధుల విషయాన్ని పెద్దగా ప్రస్తావించకపోయినా సంక్షేమ పథకాలకు సంబంధించి అప్పులకు అనుమతులు తీసుకుంటూ నెట్టుకొచ్చారు. కానీ చంద్రబాబు విషయం అలా కాదు. చాలా హామీలను అమలు చేయాల్సి ఉంది. రానున్న కాలంలో వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కినా ఎక్కవచ్చు. వీరితో పాటు అనేక వర్గాలు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు తప్పించి తమ డిమాండ్లను సాధించడం కోసం వెనక్కు తగ్గే అవకాశం లేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రధానవర్గాల డిమాండ్లను నెరవేర్చడం చంద్రబాబుకు కత్తిమీద సామే అవుతుంది. ఇక అమరావతిలో భవననిర్మాణాలు పూర్తి చేయాలన్నా కేంద్రం నుంచి పెద్దయెత్తున నిధులు అవసరమవుతాయి. రైతు కుటుంబాలు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని ఆశతో ఎదురు చూస్తున్నారు. పోలవరం పూర్తి చేసి తన సామర్థ్యాన్ని నిలబెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ లో సరైన నిధులు కేటాయింపులు జరిగితే బాబు హ్యాపీ. లేకుంటే మాత్రం ఆయన విమర్శకులకు, విపక్షాలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆయనకు ఈ 3 రోజుల సమయం మాత్రం టెన్షన పడక తప్పదంటున్నాయి పార్టీ వర్గాలు. మరి మోదీ చల్లని చూపు ఆంధ్రప్రదేశ్ పై పడుతుందా? లేదా? అన్నది ఈ నెల 23వ తేదీన తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *