Assault on public official : ప్రభుత్వ అధికారిపై దాడి

బంధువులపైనే అనుమానం
సిరా న్యూస్,పుట్టపర్తి;
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి పై కత్తులతో దాడి చేసిన సంఘటన సంచలనం రేపుతోంది. అనంతపురానికి చెందిన రాజశేఖర్ రెడ్డి సత్య సాయి జిల్లా భూగర్భజల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు నార్పల గ్రామంలోని లౌక్యతో వివాహం జరిగింది. వీరికి మూడు సంవత్సరాల కుమారుడు వున్నాడు. గత మూడు సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. భార్యను ఎలాగైనా సరే వదిలించుకోవాలని విడాకుల కోసం సైతం ప్రయత్నిస్తున్నాడు. 15 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అందుకు అత్తమామలు, భార్య లౌక్య విడాకులు వద్దు తనకు భర్తే కావాలంటూ పెద్దల సమక్షంలో తెగేసి చెప్పింది. అదేవిధంగా మరో వివాహానికి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. అతనిపై భార్య బంధువులు దాడి చేసినట్లు తెలుస్తోంది. భార్యకు దూరంగా ఉంటూ పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వెనుక వైపున నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు బైక్ పైన వచ్చి కత్తులతో దాడి చేశారు. తీవ్ర రక్తపు స్రావంతో రాజశేఖర్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అతనిని సత్యసాయి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆయనను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడిగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *