సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ఎన్నికల ఫైట్ ముగిసింది. ఆ ఫైట్ లో కాంగ్రెస్ ను అధికార పార్టీగా కూర్చోబెట్టిన ఓటర్లు, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల స్థానాలు మారినా ఫైట్ మాత్రం కామనే. అయితే ఇప్పుడు నిన్న మొన్నటిదాకా సాగిన ఎన్నికల సమరం కాస్తా అసెంబ్లీ ఫైట్ గా మారనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ 64 మంది సభ్యులతో, ఒక్క సీపీఐ ఎమ్మెల్యే మద్ధతుతో, ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. మరో వైపు 39 ఎమ్మెల్యేలతో గులాబీ పార్టీ, 8 మంది ఎమ్మెల్యేలతో కమలం పార్టీ, 7 గురు ఎమ్మెల్యేలతో ఎం.ఐ.ఎం పార్టీ ఈ కొత్త అసెంబ్లీలో కొలువు తీరనున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ టార్గెట్ గా పని చేయనున్నాయి.తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ గత రెండు ఎన్నికల్లో (2014,2018) పోటీ చేసి అధికార పక్షంగా అసెంబ్లీలో వ్యవహరించింది. రెండో టర్మ్ లో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష పార్టీయే లేని పరిస్థితి. 2014లో కాంగ్రెస్, టీడీపీలో మెజార్టీ ఎమ్మెల్యేలు అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో అధికార పార్టీ హోదాలో ఉన్న టీఆర్ఎస్ కు అసెంబ్లీలో ఎదురే లేని పరిస్థితి. అయితే శాసన మండలిలో మాత్రం విపక్షాల సభ్యులు ఎక్కువ ఉండటంతో ఆయా అంశాలపై ఎక్కువ సమయం చర్చ జరిగేది. కాని శాసనసభలో మాత్రం ఏకపక్ష చర్చ సాగేది. 2018లోను అదే పరిస్థితి. 2018లోను కాంగ్రెస్ ది అదే పరిస్థితి. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఆ ఎన్నికల్లో ఓడిపోగా, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు వంటి నేతలు కొంత ప్రయత్నించినా అధికార పార్టీని నిలదీసే పరిస్థితి ఏ మాత్రం లేదు. టీడీపీ పూర్తిగా కనుమరుగయింది. వామపక్షాలదీ అదే పరిస్థితి. బీజేపీ ఒక్క సభ్యుడు మాత్రమే గెలిచినా, చివరకు వారి బలం ముగ్గురికి చేరుకుంది. కాని అధికార టీఆర్ఎస్ కు మాత్రం ఏ పార్టీ ఇబ్బంది పెట్టలేని పరిస్థితి ఉండేది. కాస్తో కూస్తో మిత్రపక్షంగా ఉన్న ఎం.ఐ.ఎం పార్టీనే ప్రజా సమస్యలపై, ఓల్డ్ సిటీ అభివృద్ధిపై కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేది. కాని ఈ దఫా 39 సభ్యులతో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ను దూకుడుగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ దఫా అధికార పార్టీకి అసెంబ్లీలో కొంత ప్రతిఘటన పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది.అసెంబ్లీలో అధికారపార్టీ కాంగ్రెస్ స్పీడ్ కు బ్రేకులు తప్పవు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 అభ్యర్థులను గెలిపించి ఓటర్లు అసెంబ్లీకి పంపారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాల్లో ఆ పార్టీని ఎదుర్కోవడం అంత సుళువేం కాదు. 39 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ గట్టి ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉంది. వీరితో పాటు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 7 ఎం.ఐ.ఎం ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు సృష్టించే అవకాశాలు లేకపోలేదు.ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్ స్థానాలకు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈ మారు కొత్త పాత్ర పోషించనున్నారు. తెలంగాణ శాసన సభలో ప్రతిపక్ష నేత హోదాతో కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆరే ఎల్పీ లీడర్ గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే తన ఫాం హౌస్ లో కేసీఆర్ జారి పడటం, తుంటి భాగం విరగడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ జరగడంతో దాదాపు మరో నెల రోజుల పాటు కేసీఆర్ బయటకు రావడం సాధ్యపడని పరిస్థితి నెలకొంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టనప్పటికీ రానున్న రోజుల్లో జరిగే సమావేశాల్లో మాత్రం కేసీఆర్ ను ప్రతిపక్ష నేత పాత్రలో ప్రజలు చూసే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ పోషించని భిన్నమైన బాధ్యతను కేసీఆర్ నిర్వర్తంచనున్నారు.