సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అధికార మార్పిడి జరిగింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికార పీఠాన్ని అధిష్టించింది. ఇప్పుడు మరో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పాలన కొనసాగనుంది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మంత్రి వర్గం కూడా కొలువు దీరింది. అయితే రానున్న కాలమంతా అధికార పార్టీకి ఇబ్బందులు తప్పేట్లు లేవు. కేవలం ఎన్నికల మ్యానిఫేస్టోనే కాదు… చట్ట సభల్లో కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ కు మొత్తం 64 స్థానాలు, సీపీఐకి ఒక స్థానం మొత్తం 65 స్థానాలు దక్కాయి. అదే ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు 39, ఎంఐఎంకు 7, బీజేపీకి ఎనిమిది స్థానాలు సాధించాయి. అంటే విపక్ష సభ్యుల సంఖ్య 54 మంది వరకూ ఉంది. ఇక్కడే కొంత ఇబ్బంది కరమైన పరిస్థిితి ఏర్పడుతుంది. శాసనసభలో ప్రతిపక్షం నుంచి గట్టి వాయిస్ వినిపించేందుకు అన్ని పార్టీలూ సిద్ధపడతాయి. బీఆర్ఎస్, ఎంఐఎం దాదాపు మిత్రపక్షాలు కావడం, జాతీయస్థాయిలో బీజేపీ కాంగ్రెస్ కు శత్రువు కావడంతో ప్రజా సమస్యలపై కాదు…ప్రతి బిల్లును అడ్డుకునేందుకు అవి ప్రయత్నించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపించకమానేలా లేవు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బలమైన ప్రతిపక్షం లేదు. బీఆర్ఎస్ దే వాయిస్. అది అనుకున్నట్లే జరిగేది. ఉన్న ప్రతిపక్ష పార్టీల్లోని ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలోకి చేర్చుకుని ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ చేయగలిగారు. కానీ ఇప్పుడా పరిస్థితి మాత్రం లేదు. ఖచ్చితంగా విపక్ష పార్టీలు ప్రశ్నిస్తాయి. వాటి ప్రశ్నలకు ప్రభుత్వం తప్పించుకోవడానికి వీలులేదు. సమాధానం చెప్పేవరకూ నిలదీస్తాయి.