సిరా న్యూస్, బేల:
పాయల్ శంకర్ కృషితోనే బేలలో డిగ్రీ పరీక్ష కేంద్రం
ఎమ్మెల్యే పాయల్ శంకర్ చొరవతోనే ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బేల మండలంలోని విద్యార్థులకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్న విషయం పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు దూర భారంతో పాటు సమయం కూడా సరిపోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో, ఎమ్మెల్యే పాయల్ శంకర్ యూనివర్సిటీ అధికారులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బేల మండలంలోని డిగ్రీ విద్యార్థులకు బేల మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రం ఏర్పాటుకు యూనివర్సిటీ అధికారులు ఒప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు. పరీక్ష కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట పలువురు బిజెపి నాయకులు ఉన్నారు.