సిరా న్యూస్;
అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావడం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. దీని మీద మోడీ భక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. వస్తే ఎంత రాకపోతే ఎంత అసలు రామాలయం కోసం పూరీ శంకరాచార్య ఏం చేశారంటూ నిలదీస్తున్నారు. రథయాత్ర నిర్వహించి, బాబరీ మసీదు కూల్చివేత కేసులను ఎదుర్కొన్న ఎల్కె అద్వానీకి ఆహ్వానం ఇస్తూనే అసలు కార్యక్రమానికి రావద్దని చెప్పినట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిత్రం ఏమిటంటే రామాలయంతో ఎలాంటి సంబంధంలేని, బాబరీ మసీదు కూల్చివేతను ఖండించిన సీతారాం ఏచూరి, ఇతర పార్టీల నేతలనూ ఆహ్వానించారు గానీ రావద్దని చెప్పలేదు. హాజరు కావడం లేదని చెప్పిన వారి మీద ప్రచార దాడులు చేస్తున్నారు.అద్వానీ (96), మురళీమనోహర్ జోషి(90) ఏండ్ల పెద్దవారు గనుక వారు వచ్చి ఇబ్బందిపడతారని అందువల్లనే రావద్దని చెప్పామని విమర్శలు చెలరేగిన తరువాత వివరణ ఇచ్చుకున్నారు. తరువాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ నేతలు ఆహ్వానించినట్లు ప్రకటించారు. కానీ మాజీ ప్రధాని దేవెగౌడకూ 90 ఏండ్లే అయినప్పటికీ ఆయన వయసు రీత్యా రావద్దని నిర్వాహకులు చెప్పలేదు. ఎందుకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత దేవెగౌడ, కుమారస్వామి పార్టీ జెడిఎస్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపితో జట్టుకట్టాలని నిర్ణయించింది. అందుకే అయోధ్య రామాలయ రాజకీయం రంజుగా నడుస్తోంది అని చెప్పాల్సి వస్తోంది.ఈ మాట అంటే కొందరు మనోభావాలను ముందుకు తెచ్చుకొని బాధపడితే చేసేదేమీ లేదు. వయసు రీత్యా కదలలేని స్థితిలో వున్నప్పటికీ శుభకార్యాలు జరిగినపుడు ఆహ్వానం పలకడం, వారు రాలేమని చెప్పినపుడు వీలు చూసుకొని రావాలని ఆకాంక్ష వెలిబుచ్చడం మన భారతీయ సంప్రదాయం.కానీ దాన్ని తుంగలో తొక్కి రావద్దని మేమే చెప్పామని నిర్వాహకులు చెప్పడాన్ని ఏ సంప్రదాయం అంటారో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. రథయాత్ర పేరుతో బిజెపి నేత ఎల్కె అద్వానీ నిర్వహించిన కార్యక్రమం అది సృష్టించిన వినాశకర, అవాంఛనీయ ఉదంతాల గురించి తెలిసిందే. వారు వస్తారా లేదా స్పందన ఏమిటో చూడాల్సి ఉంది.ఒకవేళ వారు నిజంగా రాగలిగినా రానిచ్చేవారా అన్న సందేహాలు కూడా వారిని వద్దన్న తరువాత జనంలో తలెత్తాయి. తన దారిని సుగమం చేసుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన వెంటనే అద్వానీ, ఎంఎ జోషి వంటి వారితో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అది ఇంత వరకు ఒక్కసారి కూడా సమావేశమైన సమాచారంగానీ, ఇచ్చిన మార్గదర్శనం గురించి గానీ ఎవరికీ తెలియదు. గుడులకు పరిమితం కావాల్సిన రాముడిని ఓట్ల కోసం వీధుల్లోకి తెచ్చారు.ఆది శంకరాచార్య ఏర్పాటు చేసిన నాలుగు పీఠాల్లో పూరీలోని గోవర్ధన మఠం ఒకటి. దాని అధిపతిగా ఉన్న స్వామి నిశ్చలానంద సరస్వతి(80)కి కూడా రామాలయ నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దాన్ని తిరస్కరించినట్లు స్వామి చెప్పారు, గత వారంలో ఒక టివి ఛానల్తో, అదే విధంగా మధ్యప్రదేశ్లోని రత్లాంలో జరిగిన ఒక సనాతన ధర్మ సభకు హాజరైనపుడు విలేకర్లతో మాట్లాడారు. తనకు పంపిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒకవేళ హాజరు కావాలని అనుకుంటే తోడుగా గరిష్ఠంగా ఒకరిని మాత్రమే తెచ్చుకోవాలని దానిలో పేర్కొన్నట్లు చెబుతూ ఒక్కరు కాదు వంద మందిని అనుమతించినా ఆ రోజు తాను వెళ్లేది లేదని నిశ్చలానంద చెప్పారు. గతంలో కూడా వెళ్లానని, భవిష్యత్లో కూడా అయోధ్య వెళ్లి రాముడిని సందర్శిస్తానని అన్నారు.రాముడి విగ్రహాన్ని శాస్త్ర విధి ప్రకారం ఏర్పాటు చేయాలని ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. తమ మఠ పరిధి ప్రయాగ వరకు వుందని అయినప్పటికీ తమ సలహా, మార్గదర్శనం కానీ కోరలేదని చెప్పారు. ఈ పరిణామాల గురించి “నేను ఏ మాత్రం ఆశాభంగం చెందలేదు. ఇతర హిందూ సనాతనుల మాదిరి సంతోషంగా వున్నాను. ప్రత్యేకించి ప్రస్తుత ప్రధాని ఒక లౌకికవాదిగా కనిపించేందుకు తాపత్రయపడటం లేదు. విగ్రహారాధన, హిందూత్వ అంశాలలో అతనెంతో ధైర్యశాలి, వాటి పట్ల గర్వపడతారు. తనను ఒక లౌకికవాదిగా ప్రదర్శించుకొనేందుకు అతనేమీ పిరికివాడు కాదు. అయితే ఒక శంకరాచార్యగా నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి? మోడీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే చప్పట్లు కొట్టి పొగడాలా? అని ప్రశ్నించారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు తనను నరేంద్ర మోడీ ఎలా కలిశారో నిశ్చలానంద గుర్తు చేసుకున్నారు.కరోనాకు ముందు యోగి ఆదిత్యనాథ్ ఏడాదికి రెండు మూడు సార్లు కలిసేవారు. విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు దివంగత అశోక్ సింఘాల్ కనీసం 70 సార్లు కలిశారని చెప్పారు. తీర్థ స్థలాలను అభివృద్ధి పేరుతో భోగస్థలాలుగా మార్చుతున్నారు, టూరిజం కేంద్రాలుగా చేస్తున్నారని అన్నారు. ఇదే అంశంపై సోమవారం నాడు మరోసారి నిశ్చలానంద తన వ్యతిరేకతను వెల్లడించారు. చత్తీస్గఢ్ రాజధాని రాయపూర్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 17న ఒడిశా ప్రభుత్వం ప్రారంభించనున్న శ్రీమందిర్ పరికర్మ ప్రకల్ప పథకం గురించి స్పందించారు. పుణ్య స్థలాలను విహార కేంద్రాలుగా మార్చడం అంటే వాటిని విలాస కేంద్రాలుగా మార్చడమే అన్నారు. హోటళ్ల వారు, రవాణా రంగంలో వున్నవారు లబ్ధి పొందుతారు తప్ప ఆ కేంద్రాలకు వున్న ప్రత్యేకత తగ్గుతుందన్నారు. ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని అయితే వెళ్లాలా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. రామాలయ ప్రతిష్టాపన గురించి చేసిన వ్యాఖ్యల మీద నిశ్చలానందపై కాషాయ దళాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నాయి.