ప్రియురాలిపై కత్తి పీటతో దాడి చేసిన ప్రియుడు
సిరా న్యూస్,హైదరాబాద్;
ఇది వరకే వివాహం జరిగి విడాకులైన మహిళతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న ప్రియుడే అనుమానంతో ప్రియురాలిపై కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. వివరాలలోకి వెళితే….పాతబస్తీ ఛత్రినాక కు చెందిన శ్రావ్య (32) కు ఇది వరకే ఓ వ్యక్తి తో 2019 లో వివాహం జరిగింది. వారి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకోవడంతో విడాకులు సైతం తీసుకున్నట్లు సమాచారం. గౌలిపుర కు చెందిన మణికంఠ, శ్రావ్య లు చిన్ననాటి స్నేహితులు. మొదటి భర్తతో విడాకుల అనంతరం శ్రావ్యతో మణికంఠ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఆమె కొన్ని రోజులుగా మణికంఠ తో దూరం గా ఉంటుండడంతో ప్రియురాలు మరొకరితో ను ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అనుమానంతో మంగళ వారం ఉదయం శ్రావ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి మణికంఠ ఇంట్లొకి వెళ్ళాడు. ఆమెతో గొడవకు దిగాడు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఇంట్లోని కత్తి పీటతో గొంతు కోయడంతో పాటు ముఖం పై దాడి చేశాడు. అరుపులు విని కిటికీ అద్దాలు పగులకొట్టి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాల పాలైన శ్రావ్య ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
====================