సిరాన్యూస్,బేల
బాధిలో అటవీ అధికారులతో రైతుల వాగ్వాదం
* పోడుసాగును అడ్డుకున్న అటవీ అధికారులు
*పురుగుల మందు డబ్బాతో రైతుల నిరసన
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బాధి అటవీ బీట్లో పోడు సాగు చేస్తున్న రైతులను సోమవారం అటవీ అధికారులు అడ్డుకున్నారు.రైతులు సాగు చేస్తున్న పోడు భూముల్లో కందకాలు తవ్వి చెట్లను పెంచడానికి అటవీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.దీంతో రైతులు అటవీ అధికారులకు అడ్డుకునే ప్రయత్నం చేశారు.గత ఇరవై సంవత్సరాల నుండి పోడుభూములను సాగు చేయనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని వాగ్వాదానికి దిగారు.ఈసందర్బంగా రైతులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా పోడు భూములను సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తూ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.ఇక్కడున్న రైతులకు కనీసం ఒక గుంట భూమి కూడా లేదని ఉన్న పోడు భూములను అటవీ అధికారులు లాక్కుంటే బ్రతకడం కష్టంమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న భూములను అటవీ అధికారులు లాక్కుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఫారెస్ట్ అధికారుల వేధింపుల నుంచి తమను కాపాడి తమకు తగు న్యాయం చేయాలని కోరారు.