సిరా న్యూస్, కళ్యాణదుర్గం
ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధం
* జర్నలిస్టు పై దాడి అమానుషం
* బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు మల్లారెడ్డి
రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు మల్లారెడ్డి అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక సప్తగిరి లాడ్జిలో బీజేపి అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజు, అసెంబ్లీ కో-కన్వీనర్ గంగాధర్ అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు మల్లారెడ్డి మాట్లాడుతూ రాప్తాడు అసెంబ్లీలో జరిగిన వైసీపీ పార్టీ సిద్ధం కార్యక్రమం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీడియా స్వేచ్ఛకు అత్యున్నత స్థానం ఉందన్నారు. అటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన ఈ వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ తన విధులను నిర్వహిస్తున్న ఒక జర్నలిస్టు పై అత్యంత పాషవికంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా లేదా అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించి యధా రాజా తథా ప్రజా అన్నట్టు వైసిపి కార్యకర్తలు ఉన్నారన్నారు. నాయకుని యొక్క ఆ ప్రజాస్వామిక చర్యల నుంచి స్ఫూర్తి పొంది ఒక వీధి రౌడీల్లా ప్రవర్తించి ఒక జర్నలిస్టును ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే విధంగా వైసీపీ నాయకులు దాడి చేశారంటే, ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో అమలు అవుతుందని అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని రాబోవు రోజుల్లో తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.