BAR Election: హ్యాట్రిక్‌ కొట్టిన నగేష్‌… చరిత్ర సృష్టించిన రజిత రెడ్డి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

+ ముచ్చటగా మూడోసారి బార్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఎన్రాల నగేష్‌
+ వైస్‌ ప్రెసిడెంట్‌గా గెలిచి చరిత్ర సృష్టించిన రజిత రెడ్డి
+ ప్రధాన కార్యదర్శిగా సంతోష్‌… స్పొర్ట్స్‌ సెక్రెటరీగా ముజాయిద్‌…
+ రసవత్తరంగా సాగిన ఆదిలాబాద్‌ బార్‌ ఎన్నికలు

ఆదిలాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా న్యాయవాది ఎన్రాల నగేష్‌ వరుసగా మూడోసారి విజయం సాధించి, రికార్డ్‌ సృష్టించారు. 2022 ఎన్నికల్లో మొదటిసారిగా బార్‌ ఎన్నికల్లో పోటీ చేసిన నగేష్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అటుతరువాత 2023లో సైతం మరల పోటీ చేయగా రెండోసారి సైతం విజయం వరించింది. అయితే మూడోసారి హ్యాట్రిక్‌ దిశగా ఈ ఏడాది నగేష్‌ ఎన్నికల బరిలో నిల్చున్నారు. అతనికి పోటీగా న్యాయవాది బిపిన్‌ కుమార్‌ పటేల్, మేకల మధుకర్‌ ఎన్నికల బరిలో ఉండగా, గురువారం బార్‌ అసోసియేషన్‌లో నిర్వహించిన ఎన్నికల్లో ఎన్రాల నగేష్‌ విజయ ఢంకా మోగించారు. మొత్తం 159 ఓట్లు పోలవ్వగా, రెండు ఓట్లు ఇన్‌వ్యాలిడ్‌గా డిక్లేర్‌ చేసారు. అనంతరం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో నగేష్‌కు 74 ఓట్లు రాగా, బిపిన్‌కు 54, మధుకర్‌కు 29 ఓట్లు వచ్చాయి. దీంతో నగేష్‌ 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

చరిత్ర సృష్టించిన రజిత రెడ్డి…
ఆదిలాబాద్‌ బార్‌ ఎన్నికల్లో గతంలో మహిళ న్యాయవాదులు పోటీ చెసి గెలిచిన దాఖలాలు లేవు. మొదటి సారిగా మహిళ న్యాయవాది రజిత రెడ్డి బరిలో నిల్వడంతో మెజార్టి న్యాయవాదులు ఆమెకు పట్టం కట్టారు. గతంలో మహిళ న్యాయవాదులు కేవలం మహిళ ప్రతినిధులుగా మాత్రమే ఎన్నుకోబడేవారు. కానీ ఈ సారి బార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రేసులో రజిత రెడ్డి నిల్వడంతో ఆదిలాబాద్‌ బార్‌ అసోసియేషన్‌లో నవశకాని నాంది పలకినట్లు అయ్యింది. ఎన్నికల్లో రజిత రెడ్డికి 75 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థులు న్యాయవాదులు చంద్రకాంత్‌ చౌదరికి 46, కల్లెం ప్రవీణ్‌ రెడ్డికి 36 ఓట్లు వచ్చాయి. దీంతో 29 ఓట్ల తేడాతో రజిత రెడ్డి విజయం సాధించారు.

ప్రధాన కార్యదర్శిగా సంతోష్‌… స్పొర్ట్స్‌ సెక్రెటరీగా ముజాయిద్‌…
ఆదిలాబాద్‌ బార్‌ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవి కోసం ఎంబడి సంతోష్, చందు సింగ్, వై సంజయ్‌ రెడ్డిలు బరిలో ఉండగా, అత్యధిక ఓట్లు సాధించి ఎంబడి సంతోష్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. కాగా స్పోర్ట్స్‌ సెక్రెటరీ పోస్ట్‌ కోసం ముజాయిద్‌ హుస్సేన్, ఉమేష్‌రావ్‌ డోలేలు పోటీలో ఉండగా, మెజార్టీ ఓట్లు సాధించిన ముజాయిద్‌ హుస్సేన్‌ స్పోర్ట్స్‌ సెక్రెటరీగా విజయం కైవసం చేసుకున్నారు. దీంతో ముఖ్య ఎన్నికల అధికారి ముస్కు రమణ రెడ్డి, సహాయ ఎన్నికల అధికారులు వై వినోద్‌ రెడ్డి, భావన సింగ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదిలాబాద్‌ బార్‌ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *